తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు?

by Disha Web Desk 2 |
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయం అనే ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తున్నా నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మంచిర్యాలలో పార్టీ నిర్వహించిన సత్యమేవ జయతే సభ పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన ఈ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, జీవన్ రెడ్డి తదితరుల ఒకే వేదికపై కనిపించం కాంగ్రెస్ వాదులను సంతోషానికి గురి చేసింది. అయితే ఇదే సమయంలో ఈ సభలో నుంచి వచ్చిన స్లోగన్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

సీఎం పోస్ట్ రగడ?

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీఎం పదవి ఎవరిని వరిస్తుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. మంచిర్యాల సభలో పలువురు భట్టి విక్రమార్కను పొగడ్తల్లో ముంచెత్తడం.. ప్రేమ్ సాగర్ రావు అనుచరులు ఏకంగా సభలో ‘సీఎం.. భట్టి.. సీఎం భట్టి’ అంటూ నినాదాలు చేయడం ఆసక్తిగా మారింది. ఇదే సభలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా భట్టిని వైఎస్సార్ తో పోల్చారు. భట్టి పంచెకట్టుతో పాదయాత్ర చేస్తుంటే వైఎస్సార్ ను చూస్తున్నట్టుగా ఉందని కితాబిచ్చారు. సభ ప్రారంభానికి ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భట్టి విక్రమార్కను సీఎం చేయాలని వెంకట్ రెడ్డి పరోక్షంగా ప్రతిపాదన చేశారనే టాక్ వినిపిస్తోంది. దళిత సీఎం హామీ విషయంలో కేసీఆర్ ఎలాగు మాట తప్పారని, ఈ హామీనికి తాము భరోసా ఇవ్వడం ద్వారా ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సీఎం పోస్ట్ కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం గంపెడాశలు పెట్టుకున్నారనే చర్చ ఉంది. సీఎం పదవి కోసం రాజకీయాలు చేస్తున్నానని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. పదవులు కోరుకోవడంలో తప్పు లేదనేది రేవంత్ రెడ్డి వాదన.

రేవంత్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న సీనియర్లు:

ఏ మూహుర్తాన రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టారో కానీ ఆ పదవిని అలంకరించి ఏళ్లు గడుస్తున్నా ఆయన పట్ల సీనియర్ల అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. సీనియర్లు వర్సెస్ జూనియర్లు అనే క్లాష్ పార్టీలో ఎప్పడికప్పుడు ఏదో రూపంలో పొడ చూపుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు మీడియ ముందుకు రావడం, అధిష్టానం వద్ద మొరపెట్టుకోవడం పరిపాటిగా మారింది. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, దుందుడుకు స్వభావం పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హాత్ సే హాత్ జోడో యాత్రలు సైతం వేరు వేరుగా నిర్వహించడం పార్టీలో కలహాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అద్దం పడుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పరోక్షంగా సీఎం పోస్ట్ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయనే విషయాన్ని గ్రహించిన సీనియర్లు వ్యూహాత్మకంగా భట్టిని సీఎం రేస్ లోకి తీసుకువస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే మంచిర్యాల సభలో భట్టి పేరు మార్మోగిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయాన్ని రేవంత్ వర్గం ఎలా తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఓ వైపు బీఆర్ఎస్, మరో వైపు బీజేపీలు దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో కాంగ్రెస్ లో జరుగుతున్న సీఎం పోస్ట్ చర్చ ఆ పార్టీని ఏ తీరాన్ని చేర్చుతుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి: తెలంగాణలో ఓటు విలువ రూ.6 వేలు: అద్దంకి దయాకర్



Next Story

Most Viewed