నామినేటెడ్ రాలేదనే భావన ఉంటుంది : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

by Dishanational2 |
నామినేటెడ్ రాలేదనే భావన ఉంటుంది : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ అధికారంలోకి వచ్చి 8ఏళ్లు అయినా నామినేటెడ్ పోస్టు రాలేదనే భావన కార్యకర్తల్లో ఉంటుందని, అందరికీ అవకాశాలు వస్తాయని మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని, వివిధ పదవులలో అవకాశం కల్పించి తగిన గౌరవాన్ని కల్పిస్తుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్నారు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మాకు సమయం వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించారు.

మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలంతా కలికట్టుగా పని చేసి మరో సారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ లేకుండా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయో ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, నాయకుడు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed