నిఖిత మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయండి: మందకృష్ణ మాదిగ

by Disha Web Desk 11 |
నిఖిత మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయండి: మందకృష్ణ మాదిగ
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధి మన్ననూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన నిఖిత ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో అన్ని పార్టీల అఖిలపక్షాలు, ప్రజాసంఘాలు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశీం, మహేష్ అధ్యక్షతన ర్యాలీ, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. గురుకులంలో దళిత విద్యార్థిని నిఖిత అనుమానాస్పదంగా మృతి చెంది 40రోజులు గడుస్తున్నా వాస్తవాలు బహిర్గతం చేయడంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం చెందారని మండిపడ్డారు.

నిఖిత మృతికి ముందు పాఠశాలలో ఆ ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన చూసినందుకే దాడి చేసి హత్య చేశారని ఆరోపించడానికి చాలా కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. బాధిత కుటుంబానికి, సమాజానికి నిఖిత మృతిపై డాక్టర్ల నివేదిక బహిర్గతం చేయకుండా దోషులను కాపాడుతూ వారికి అండగా పోలీసులు, ప్రజాప్రతినిధులు ఉంటున్నారని ఆరోపించారు. నిఖిత మృతిపై సమగ్ర విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి నియామకం చేస్తేనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. నిఖితను హత్య చేసిన నిందితులు వారికి, సహకరించిన వాళ్లపైనే మా పోరాటమని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్, అధ్యక్షుడు డా. వంశీకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, కాశన్న యాదవ్, మాలమహానాడు రాష్ట్ర నాయకులు శ్రీశైలం, మల్లికార్జున్, సీపీఎం నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story