రాష్ట్రంలో ఆడబిడ్డల ఆత్మగౌరవం భంగపడ్డది.. తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్

by Dishafeatures2 |
రాష్ట్రంలో ఆడబిడ్డల ఆత్మగౌరవం భంగపడ్డది.. తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి మహిళని గౌరవించే సంస్కృతి లేదని, టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవంలో కూడా ఆడబిడ్డల ఆత్మగౌరవం భంగపడ్డదని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు బతుకమ్మ బోనాలతో తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున పాల్గొన్నారని, కానీ నేడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మహిళలు వివక్షతకు గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత అనేది మాటల్లోనే ఉంది తప్ప చేతల్లో లేదని విమర్శించారు.

‘ఉద్యోగం, ఉపాధి, రక్షణ మా ఆత్మగౌరవం.. హత్యలు, అత్యాచారాలు లేని తెలంగాణ మా ఆత్మగౌరవం, చట్టసభల్లో మహిళా సాధికారత మా ఆత్మగౌరవం, బెల్ట్ షాపు రద్దుతో, మద్యపాన నియంత్రణతో మా ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడుకోవడం మా ఆత్మగౌరవం’ అని పేర్కొన్నారు. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో కొరవడినవని తెలిపారు. అందుకే తెలంగాణ "ఆత్మ గౌరవ వేదిక" ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఉదయం 10 గంటల నుంచి దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల మహిళలు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని గడిలో బందీ అయిన మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed