‘ఎస్సీ, ఎస్టీ‌ల‌ దాడుల‌పై తక్షణమే స్పందించాలి’

by Disha Web Desk 4 |
‘ఎస్సీ, ఎస్టీ‌ల‌ దాడుల‌పై తక్షణమే స్పందించాలి’
X

దిశ, మెదక్ ప్రతినిధి : ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరితగతిన కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమికంగా 25 శాతం నష్టపరిహారం ఇప్పించాలని సూచించారు.

కేసును 60 రోజులలోగా పరిష్కరించకపోతే బలహీనపడే అవకాశముందని, కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసి క్లియర్‌గా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ఎస్సి, ఎస్టీ‌లపై దాడులకు సంబంధించి వివిధ సెక్షన్‌ల కింద 47 రకాల కేసులు నమోదు చేయుటకు, నష్టపరిహారం అందించుటకు చట్టం రక్షణ కల్పించిందన్నారు. కేసు తీవ్రతను బట్టి ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు స్థాయిలో బాధితులకు 25 శాతం, చార్జిషీట్ దాఖలులో 50 శాతం, కోర్టు విచారణ పూర్తైన పిదప మరో 25 శాతం నష్టపరిహారం అందించబడుతుందన్నారు.

జిల్లాలో ఎస్సి, ఎస్టీ దాడులకు సంబంధించి గత జులై నుండి ఇప్పటి వరకు 25 కేసులు నమోదు కాగా అందులో అందులో 11 కేసులపై చార్జి షీటు దాఖలు చేశామని, మరో 14 కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయన్నారు. ఇందులో 23 కేసులకు సంబంధించి బాధితులకు ప్రాథమిక విచారణ, చార్జిషీట్ స్థాయిలో 20 లక్షల 25 వేల నష్టపరిహారం మంజూరు చేశామన్నారు. మరో రెండు కేసులలో కుల ధ్రువీకరణ పత్రం జారీకి తహసీల్ధార్‌కు తగు ఆదేశాలిస్తామన్నారు.

మరో కేసులో బాధితుల నుండి సమాచారం సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు పోలీసులకు సూచించారు. కాగా ఇంటి పక్క గొడవలు, పక్క పొలాల సమస్యలు వంటి చిన్న చిన్న కేసులలో సాధ్యమైనంత వరకు మనస్పర్థలను పరిష్కరించే దిశగా పోలీసులు కృషి చేయాలని సూచించారు. బాధితుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, వారు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించి 60 రోజులలోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, లేకుంటే కేసు నీరుగారే ప్రమాదముందన్నారు. బాధితునికి న్యాయం జరగకపోవచ్చని అన్నారు.

చార్జీ షీట్ సమయంలో ఆధారాలు పక్కాగా సేకరించాలని, సంగారెడ్డి కోర్టులో పెండింగులో ఉన్న 136 కేసుల సత్వర హియరింగ్‌కు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో టచ్‌లో ఉండాలని అన్నారు. భూ వివాద సమస్యలు మినహా మిగతా కేసులలో సత్వరమే ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్, డిఎస్పీ సైదులు, ఆర్.డి.ఓ. సాయి రామ్, డీఎస్డీవో విజయలక్ష్మి, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, బీసీ అభివృద్ధి అధికారి కేశూరం, డిటిఓ చినసాయిలు, డాక్టర్ నవీన్, విజిలెన్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story