న్యాయవాదుల గొంతుకనై నిలబడతా : రోహిత్ పాల్ సింగ్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-12-29 14:33:47  IST  )

జనవరి 30న జరగనున్న తెలంగాణ అడ్వకేట్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది.

న్యాయవాదుల గొంతుకనై నిలబడతా : రోహిత్ పాల్ సింగ్
X

దిశ, హైదరాబాద్ : న్యాయవాదుల సమస్యలపై నిరంతర పోరాటం చేయడంతోపాటు వారి హక్కుల సాధనకు గొంతుకనై నిలబడతానని సీనియర్ అడ్వకేట్ రోహిత్ పాల్ సింగ్ అన్నారు. జనవరి 30న జరగనున్న తెలంగాణ అడ్వకేట్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం తన ఛాంబర్‌లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. యువ న్యాయవాదులుగా పనిచేస్తున్న బార్ కౌన్సిల్ మెంబర్స్ సమస్యలపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. న్యాయవాదులు నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ అడ్వకేట్ వృత్తిని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన జూనియర్ అడ్వొకేట్స్ అరకొర సంపాదనతో పూట గడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని విచారం వ్యక్తం చేశారు. వారి కనీస అవసరాలు తీరే విధంగా సంపాదన లేదన్నారు. అందుకే న్యాయవాదిగా ఎన్‌రోలై ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి న్యాయవాదికి మొదటి ఐదేళ్లు రూ.10 వేల గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ భృతిని ప్రభుత్వము, లేదా అసోసియేషన్ నుంచి అందేలా తాను కృషి చేస్తానని రోహిత్ పాల్ సింగ్ ప్రకటించారు.

అంతేకాక న్యాయవాదుల రక్షణ కోసం పోరాటం చేస్తానని తెలిపారు. యువ న్యాయవాదుల వృత్తి నైపుణ్యాలు, ఆరోగ్య కార్డులు, సంక్షేమం కోసం ప్రయత్నిస్తానని, ప్రతి న్యాయవాదికి మౌలిక సదుపాయాలు అందేలా పాటుపడతానని చెప్పారు. రాష్ట్రంలో కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి, బార్‌ అసోసియేషన్‌ భవనాలల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. మహిళా న్యాయవాదులు ప్రత్యేక మరుగుదొడ్లు, విశ్రాంత గదులు, సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనకు భారీగా ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీనియర్ అడ్వొకేట్ ప్రవీణ్ సాగర్, భార్గవ్, పి.మోహిత్, రాహుల్ కనకం, శివచారి తదితరులు ఉన్నారు.

Next Story