రేపటిలోగా క్షమాపణలు చెప్పాలి.. పొన్నంకు మంత్రి అడ్లూరి అల్టిమేటం (వీడియో)

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-07 06:20:30  IST  )

మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బాడీ షేమింగ్ వ్యాఖ్యల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా, సోషల్ మీడియా (Social Media)లో తనకు అండగా నిలబడిన మాదిగ కుల బాంధవులు, కుల సంఘాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) కృతజ్ఞతలు తెలిపారు.

రేపటిలోగా క్షమాపణలు చెప్పాలి.. పొన్నంకు మంత్రి అడ్లూరి అల్టిమేటం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బాడీ షేమింగ్ వ్యాఖ్యల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా, సోషల్ మీడియా (Social Media)లో తనకు అండగా నిలబడిన మాదిగ కుల బాంధవులు, కుల సంఘాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ జర్నలిస్టుతో ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అడ్లూరి మాట్లాడుతూ.. మాదిగలంటే అంతా చిన్నచూపా అని ఇండైరెక్ట్‌గా మంత్రి పొన్నం, వివేక్‌లను ప్రశ్నించారు. తనను అన్న మాటలకు తప్పు ఒప్పుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోరితే ఆయనకు గౌరవం ఉంటుందని అన్నారు. వ్యక్తిగతంగా భవిష్యత్తులో ఇంకెవరిని దూషించడం తప్పని గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.

మంత్రి వివేక్ కనీసం ఆపలేదు..

మంత్రి పొన్నం ప్రభాకర్ అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా.. పక్కనే ఉన్న దళిత బిడ్డ మంత్రి వివేక్ కూడా.. తాను రాకపోతే సమావేశం నుంచి లేచి వెళ్లిపోతామనడం భావ్యమేనా అని అడ్లూరి ప్రశ్నించారు. ఆయన కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా నిలబడితే.. తాము అన్నీ మీద వేసుకుని గెలిపించామని కామెంట్ చేశారు. వాళ్ల తండ్రి వెంకట‌స్వామి (Venkata Swamy) ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వాళ్ల కుంటుంబానికి విధేయులుగా పని చేశామని గుర్తు చేశారు. పక్కన ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తమ తోటి సామాజిక వర్గం వాడిని ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావని మంత్రి వివేక్ ఒక్కమాట అనాలా.. వాద్దా అని అడ్లూరి ఫైర్ అయ్యారు.

నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, డబ్బున్నోడిని కాదు..

అది మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రాం అని.. సంబంధిత శాఖ మంత్రిగా తాను 3.30కి కార్యక్రమానికి హాజరవుతానని చెప్పానని మంత్రి అడ్లూరి అన్నారు. తాను, తన వెంట ఉన్న ఎస్కార్ట్ టీమ్ భోజనం చేయలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ పహీమ్‌కు చెప్పానని అన్నారు. ఇంతలోనే మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ తమకు అర్జెంట్ ఉందని మళ్లీ కాల్ చేస్తే.. సమావేశం ప్రారంభించమని మధ్యలో వచ్చి జాయిన్ అవుతానని చెప్పినట్లుగా సమాధానమిచ్చానని అడ్లూరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని, తన తండ్రి కేంద్ర మంత్రి కాదని, డబ్బున్నోడిని కాదన్నారు.

రేపటి వరకు చూస్తాం...

పొన్నం ప్రభాకర్ లాగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే వాడిని కాదని.. వాళ్ల ముందు చిన్న వ్యక్తినని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆయన అలా నా మీద మాట్లాడతారని కలలో కూడా ఊహించలేదని అన్నారు. మొదటి నుంచి వివేక్‌కు తాను పక్కనే కూర్చోవడం నచ్చదని, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన వ్యక్తి అని కామెంట్ చేశారు. ఒక్క పార్టీ కింద పని చేస్తున్నప్పుడు.. తమ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని మీడియా ముందు కూడా తనను ఉద్దేశించి పొన్నం అనకపోవచ్చని తాను చెప్పానన్నారు. జరిగిన విషయం మీద పొన్నం తనకు ఫోన్ చేసి మాట్లాడడతారని అనుకున్నా కానీ, అదేం జరగలేదని అన్నారు. తనను వ్యక్తిగతంగా అంటే మాట పడొచ్చేమో కానీ.. మొత్తం మాదిగ జాతిని అనడం కరెక్ట్ కాదన్నారు. తాము రేపటి వరకు పొన్నం ప్రభాకర్ నుంచి సమాధానం ఆశిస్తున్నామని.. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు అవుతాడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story