చెరువుల్లో మ‌ట్టిపోయ‌డంపై హైడ్రా ఆగ్ర‌హం

by Ajay Maddhiboyina |

చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్‌(ఎఫ్టీఎల్), బ‌ఫ‌ర్ ప‌రిధిల్లో మ‌ట్టి పోయ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. చెరువుల స్వ‌రూపాన్ని మార్చిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

చెరువుల్లో మ‌ట్టిపోయ‌డంపై హైడ్రా ఆగ్ర‌హం
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్‌(ఎఫ్టీఎల్), బ‌ఫ‌ర్ ప‌రిధిల్లో మ‌ట్టి పోయ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. చెరువుల స్వ‌రూపాన్ని మార్చిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. మట్టి పోసి నింప‌డానికి అవ‌కాశం లేకుండా ఫెన్సింగ్ వేయాల‌ని నిర్ణ‌యించారు. అలాగే మట్టి ఎవ‌రు పోసారో వాళ్ల‌తోనే తీయించాల‌ని.. వారిపై కేసులు పెట్టాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ ప‌రిధిలో మ‌ట్టి పోసి చెరువుల‌ను నింపుతున్నార‌నే ఫిర్యాదుల నేప‌థ్యంలో తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, గండిపేట చెరువుల‌ను శ‌నివారం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. మెల్లచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోయడాన్ని స్థానికులు హైడ్రా కమిషనర్ కు చూపించారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలో పోసిన మట్టిని వెంటనే తొలగించాలని రాజు యాదవ్ ను ఆదేశించారు. లేని ప‌క్షంలో చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. గండిపేట చెరువులో హిమాయత్ నగర్ విలేజ్ వైపు మట్టిపోయడాన్ని హైడ్రా కమిషనర్ సీరియస్‌గా పరిగణించారు. వేసిన మట్టిని వెంటనే తొలగించాలని అక్క‌డ మ‌ట్టితో నింపిన డా. ఖుర్షీద్ ను ఆదేశించారు. 48 గంటల్లో మట్టిని తొలగించకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. త‌మ‌కు గ‌డువు కావాల‌ని.. కోర‌గా.. మ‌రో 24 గంట‌ల స‌మ‌యాన్ని ఇచ్చారు. చెరువుల స్వ‌రూపాన్ని మార్చితే ఏమాత్రం ఉపేక్షించ‌మ‌ని హెచ్చ‌రించారు.

జూబ్లీహిల్స్‌లో పార్కు క‌బ్జాల తొల‌గింపు..

జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ స‌ర్కిల్-36 ప‌రిధిలోని రోడ్డు నంబరు 32లో రెండు ఎక‌రాల‌కు పైగా ఉన్న పార్కులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను జీహెచ్ఎంసీతో క‌ల‌సి హైడ్రా తొల‌గించింది. పార్కు క‌బ్జాకు గురైంద‌ని.. అందులో అక్ర‌మ క‌ట్ట‌డాలు వ‌చ్చాయ‌ని మీడియాలో వ‌చ్చిన వార్త‌ల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్‌ శ‌నివారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. వెనువెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డానికి ఆదేశించారు. పార్కుకు ఆనుకుని ఉన్న రెండు ఇళ్ల‌వారు .. వారి వాచ్‌మ్యాన్‌కోసం, ఆవుల కోసం షెడ్డులు వేయ‌డాన్ని క‌మిష‌న‌ర్ సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. పార్కులోకి గేట్లు పెట్టుకోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఆ గేట్లను తొల‌గించి ప్ర‌హ‌రీ నిర్మించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రధాన గేట్‌ను ఏర్పాటు చేసి ప్రజలందరూ పార్కును సందర్శించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో వెనువెంట‌నే ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డం ప‌ట్ల అక్క‌డి స్థానికులు హ‌ర్షం వ్య‌క్తంచేశారు.

బుల్కాపూర్ నాల‌ను పున‌రుద్ధ‌రిస్తాం..

హుస్సేన్ సాగ‌ర్‌కు మంచినీటిని తీసుకు వ‌చ్చే చారిత్ర‌క బుల్కాపూర్ నాల‌ను పున‌రుద్ధ‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ అధికారుల‌కు సూచించారు. మ‌ణికొండ ప్రాంతంలో బుల్కాపూర్ నాలా క‌బ్జాల‌కు గురౌతోంద‌న్న ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. శంకరపల్లి లోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట‌, నార్సింగ్‌, పుప్పలగూడ, మ‌ణికొండ, దర్గా, షేకేపేట్, టోలి చౌకి , పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగ‌ర్‌కు వర్షపు నీరును తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా పున‌రుద్ధ‌ర‌ణ‌తో చాలా ప్రాంతాల‌కు భూగ‌ర్భ జ‌లాలు పెంచిన‌ట్టు అవుతుంద‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. ఈ నాలా ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో పెట్టుకుని పున‌రుద్ధ‌రించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సూచించారు.

Next Story