Hydra: చెరువుల కబ్జాలకు చెక్.. హైడ్రా హైటెక్ సర్వైలెన్స్ ప్రారంభం

by Ramesh Naini |

చెరువుల ప‌రిర‌క్షణ‌కు హైడ్రా ప‌టిష్టమైన నిఘా వ్యవ‌స్థను ఏర్పాటు చేసింది. మ‌ట్టితో నింపి క‌బ్జా చేయాల‌నే ప్రయ‌త్నాల‌కు చెక్ పెట్టింది.

Hydra: చెరువుల కబ్జాలకు చెక్.. హైడ్రా హైటెక్ సర్వైలెన్స్ ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెరువుల ప‌రిర‌క్షణ‌కు హైడ్రా ప‌టిష్టమైన నిఘా వ్యవ‌స్థను ఏర్పాటు చేసింది. మ‌ట్టితో నింపి క‌బ్జా చేయాల‌నే ప్రయ‌త్నాల‌కు చెక్ పెట్టింది. చెరువుల చెంత సీసీటీవీ కెమేరాలు పెట్టి గ‌ట్టి నిఘా ఏర్పాటు చేసింది. వీటిని హైడ్రా కార్యాల‌యంలోని స‌ర్వర్‌కు అనుసంధానించింది. నిరంత‌రం చెరువుల చెంత ఏం జ‌రుగుతుందో తెలుసుకునే వ్యవ‌స్థను హైడ్రా కార్యాల‌యం నుంచే ప‌ర్యవేక్షించేలా ఏర్పాటు చేసింది. సీసీటీవీ కెమేరా నిఘా వ్యవ‌స్థను సోమ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్రారంభించారు. చెరువుల‌లో మ‌ట్టి పోయ‌కుండా.. ఆక్రమ‌ణ‌లు జ‌ర‌గ‌కుండా ఇప్పటికే లేక్ ప్రొటెక్షన్ టీమ్‌లు ప‌ర్యవేక్షిస్తున్నాయి. వీటికి తోడు సీసీటీవీ కెమేరా వ్యవ‌స్థ అద‌నంగా అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టయ్యంది. దాదాపు 900 కెమేరాల‌ను అమర్చి నిరంత‌ర ప‌ర్యవేక్షణ‌ చేయనున్నారు.

చెరువుల్లో ఎవ‌రైనా నిర్మాణ వ్యర్థాలు వేసినా.. మ‌ట్టితో నింపేందుకు ప్రయ‌త్నించినా.. క‌బ్జాలు చేసినా సీసీటీవీ కెమేరాల ద్వారా తెలుసుకునే వెసులుబాటు హైడ్రాకు ల‌భించింది. హైడ్రా కార్యాల‌యంలో ఉన్న కంట్రోల్ రూం నుంచి మోనిట‌ర్ల ద్వారా నిరంత‌రం ప‌రిశీలిస్తారు. మ‌ట్టిని తెచ్చి పోసిన ప‌క్షంలో ఆ వాహ‌నం వివ‌రాల‌ను తెలుసుకోవ‌డంతో పాటు.. అక్కడే ఉన్న లేక్ ప్రొటెక్షన్ టీమ్‌ను కూడా అప్రమ‌త్తం చేస్తారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న మోనిట‌ర్లకు కూడా చెరువుల చెంత హైడ్రా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమేరాల‌ను అనుసంధానం చేశారు. దీంతో నిఘా మ‌రింత ప‌టిష్టంగా ఉంటుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్యతో పాటు అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఆర్ సుద‌ర్శన్ కూడా సీసీటీవీ వ్యవ‌స్థను ప్రారంభించిన వారిలో ఉన్నారు.

Next Story