దిశ కథనానికి స్పందన.. ఆ చెట్టును నరికిన వారికి జరిమానా

by Web Desk |
దిశ కథనానికి స్పందన.. ఆ చెట్టును నరికిన వారికి జరిమానా
X

దిశ, శేరిలింగంపల్లి: 'గొడ్డలి పెట్టుకు నేలకూలిన భారీ వృక్షం' శీర్షికతో దిశ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి అటవీశాఖ అధికారులు స్పందించారు. శేరిలింగంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న వందల ఏళ్లనాటి రావిచెట్టు కొమ్మలు దారికి అడ్డుగా వస్తున్నాయని చెట్టును కొట్టారు. ఈ ఘటనపై ఈనెల 8న దిశ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఆ వృక్షం నరికివేత ఘటనలో బాధ్యులకు అటవీశాఖ అధికారులు రూ.25,000 జరిమానా విధించారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భారీ వృక్షం ఇటీవల నరికివేత ఘటనపై పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

కార్పొరేటర్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఓ నివాసం యజమానురాలు సి.స్వరూపను భారీ వృక్షం నరికివేతకు బాధ్యులుగా గుర్తించినట్లు కొత్తగూడ సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ అత్తెల్లి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వృక్షాన్ని నరికించినందుకుగాను ఆమెకు రూ.25 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్షాలను నరికివేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

ప్రమాదాన్ని అరికట్టేందుకే కొమ్మలు తొలగించాం

వృక్షం లోపలి భాగం చెదలు పట్టడం, పుచ్చిపోవడం జరిగిందని, చెట్టు నేలకూలే పరిస్థితిలో ప్రమాదాన్ని అరికట్టేందుకే సంబంధిత అధికారుల సహకారంతోనే చెట్టు కొమ్మలు తొలగించడం జరిగిందని భాద్యురాలు స్వరూప తెలిపారు. కాగా వృక్షాన్ని మొదలు వరకు నరకడాన్ని ఫిర్యాదుదారులు తీవ్రంగా ఖండించారు.


Next Story

Most Viewed