డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు..

by Disha Web Desk 20 |
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు..
X

దిశ, సికింద్రాబాద్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసి రూ. 9 లక్షల వరకు డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండకు తరలించిన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ కు చెందిన సాగర్ ( 27), అంబేద్కర్ నగర్కు చెందిన వెంకటచారి ( 56) ల పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలో అడ్డగుట్టకు చెందిన పలువురికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసి సుమారు రూ . 9 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు.

ఇల్లు ఇప్పించకుండా సంవత్సర కాలం నుంచి మాయమాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల డబ్బులిచ్చిన వారు సాగర్, వెంకటచారిని గట్టిగా నిలదీయగా అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో చేసేదేమీ లేక బాధితులు స్థానిక తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. ఆదివారం సాగర్ , వెంకటచారిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిగా విచారించగా చేసిన తప్పు ఒప్పుకున్నారు. సోమవారం వీరిద్దరిని రిమాండకు తరలించినట్లు సీఐ ఎల్లప్ప తెలిపారు.



Next Story