వెంటనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను తొలగించాలి..

by Disha Web Desk 13 |
వెంటనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను తొలగించాలి..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ప్ల కార్డులు చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కార్యాలయం లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అబిడ్స్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు సిబ్బందితో కలిసి వారిని అడ్డుకుని గేటు వద్దనే నిలిపి వేశారు.

అనంతరం కొంత మంది ప్రతినిధుల బృందం కలెక్టర్ కార్యాలయంలో టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకుని, నిరుద్యోగులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోతా రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసు నుండి కాపాడుకోవడానికి రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్తున్నారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత బాధ వారికి అర్థం కావడం లేదని అన్నారు.

పేపర్ లీకేజీకీ టీఎస్పీఎస్పీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డి బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని రోహిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి పరీక్షలు రాసిన యువతకు న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట సుమారు 20 మంది వరకు యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


Next Story