పేదల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్

by Disha Web Desk 12 |
పేదల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
X

దిశ, సిటీ బ్యూరో: నోటరీ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్ల సమస్య పరిష్కారం కోసం జీవో 58, 59ల కింద క్రమబద్దీకరించేందుకు మరో నెల రోజుల గడువును పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త సచివాలయంలో గ్రేటర్ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి కోరడంతో ఆయన ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇందుకు త్వరలోనే ఓ స్పెషల్ డ్రైవ్ ను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను సీఎం కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను చెప్పుకోవాలని సూచించారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు.

ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, నవీన్ మిట్టల్, ప్రియాంక వర్గీస్ తదితరులున్నారు.


Next Story

Most Viewed