ఆయారాం.. గయారాం.. ఎలక్షన్లప్పుడే మేమున్నామంటూ బరిలో

by Disha Web Desk 12 |
ఆయారాం.. గయారాం.. ఎలక్షన్లప్పుడే మేమున్నామంటూ బరిలో
X

దిశ, మియాపూర్: రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానిది ఒక ప్రత్యేక స్థానం. ఐటీకి కేంద్ర బిందువుగా ఉండి ప్రపంచ మేటి బహుళజాతి సంస్థలు కొలువుదీరిన ప్రాంతంగా గుర్తింపు ఉన్నది. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు జీవనం సాగిస్తుండడంతో ఒక మినీ ఇండియాగా అత్యధిక ఓటర్లు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు పోటీ చేసే అభ్యర్థుల విషయంలోను అనేక సారూప్యతలు ఉన్నాయి. గతంలో అక్కడి నుంచి పోటీ చేసి తెరమరుగై మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ దిగేందుకు ఉవ్విళ్ళూరుతున్న వారి గురించి ఒకసారి అవలోకనం చేసుకోవచ్చు. గత ఎలక్షన్‌లో ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు పెద్ద వ్యాపార వేత్త కేవలం ఎలక్షన్ల ముందు రంగంలోకి దిగి గట్టి పోటీ ఇచ్చిన విషయం విదితమే.

ఎలక్షన్ల అనంతరం ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకో కపోగా పూర్తిగా తెరమరుగు కావడం కొసమెరుపు. గత ఎలక్షన్‌లో కనిపించిన పాత ముఖాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్ళీ వస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఉన్నట్టుండి నేనున్నా అని బరిలో దిగితే కొన్నెండ్లుగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటోనని కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే ఇలా చుట్టపు చూపుగా వచ్చిన వారిని అప్పటికప్పుడు అందలం ఎక్కిస్తే మిగతావారు పూర్తిగా సహకరిస్తారా లేదా అనేది శేష ప్రశ్నే..

ఆయారాం... గయారాం..

కొంతమంది ఎలక్షన్లప్పుడే ఆయారాం గయారాం లాగా ఎక్కడినుంచో మెరుపు తీగలా వచ్చి ఆ తర్వాత కనుమరుగవుతున్నారు. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం 2018 శాసనసభ ఎన్నికల్లో కొంతమంది ఇలాగే తెరపైకి వచ్చి కనుమరుగయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ ఇలాగే వచ్చి గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు 3 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. టీడీపీ నుంచి ప్రస్తుత పరిస్థితిలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేకపోవడంతో మరోసారి ఆయనే పోటీ చేయనున్నారని ప్రచారం జోరుగా వినిపిస్తున్నది.

అయితే మరోపక్క పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు , ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలో భాగంగా పాతవారికే ఇస్తారా లేదంటే అదే సామాజిక వర్గానికి చెందిన మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా అనేది సస్పెన్స్.. ఈసారీ ఎలక్షన్ లలో మరిన్ని కొత్త పార్టీలు వైస్ ఆర్‌టి‌పీ, జనసేన , ఆమ్ఆద్మీ, ఎంఐఎంఎల తరపున మరిన్నీ కొత్త ముఖాలు సైతం తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇలా గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంతో ఆంటీ ముట్టనట్టు ఉండి లేదా చివరి క్షణంలో టికెట్ దక్కించుకున్న వారి అవకాశాలు ఎలా ఉండబోతుంది. ఏ మేరకు ఇతరులను ప్రభావితం చేయనున్నారో ప్రధాన పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ఏది ఏమైనా అలాంటి కొత్త ముఖాలను ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరి. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయా పార్టీ నుంచి పోటీ చేసే కొత్త ముఖాలు ఈసారి ఎవరి గెలుపును ప్రభావితం చేయనున్నారో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed