34 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే 'మార్నింగ్ వాక్'

by Web Desk |
34 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ప్రజా నాయ‌కుడిగా అంచెలంచెలుగా ఎదిగిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం నిరంత‌రం ప్రజ‌ల‌తో మ‌మేక‌మ‌య్యే నాయ‌కుడిగా, సుధీర‌న్న అంటే ప‌లికే సేవ‌కుడిగా గుర్తింపు పొందారు. ఆయ‌న ప్రజా స‌మ‌స్యలు తెలుసుకునేందుకు 'మార్నింగ్ వాక్' ప్రారంభించి సరిగ్గా 34 ఏళ్లు పూర్తి చేసుకుని 35వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. 1987లో అక్బర్ బాగ్ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో పక్కనే ఉన్న ఆంధ్ర కాలనీ (ఏం.పీ)కాలనీ వాసులు సుధీర్ రెడ్డి నివాసానికి వచ్చి మాకు తాగునీరు సరిగ్గా రావడం లేదని మొర‌పెట్టుకునేవారు. అయితే అప్పట్లో మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు స‌ర‌ఫ‌రా అయ్యేది. దీంతో సుధీర్ రెడ్డి వాటర్ వర్క్స్ అధికారులతో గొడవ పడేవారు. ఈ సమస్యను అధికారులకు ఎలా స్వయంగా తెలియజేయాలని సుధీర్ రెడ్డి తీవ్రంగా ఆలోచించి, 'మార్నింగ్ వాక్'కు స్వీకారం చుట్టారు. రోజూ మార్నింగ్ వాక్ చేస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చనే ఆలోచన వచ్చింది.

ఈ నేపథ్యంలో 1987 జనవరి 23 రోజున ఉదయం 04.30 నిమిషాలకు తన డివిజన్ పరిధిలో 'మార్నింగ్ వాక్' ప్రారంభించారు. అప్పుడు స్వయంగా వాటర్ వర్క్స్ అధికారులను వెంటపెట్టుకొని ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులకు చూపెట్టేవారు. అప్పుడు మొదలుపెట్టిన మార్నింగ్ వాక్ ఇప్పటి వరకు అనగా, దాదాపు 35 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగుతోంది. కొన్ని వేల గంటలు నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీల్లో తిరిగి, ప్రజా సమస్యలను తెలుసుకొని, కొన్ని అప్పటిక‌ప్పుడే పరిష్కరించి, మరికొన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటు మరికొంత మంది నాయకులు 'మార్నింగ్ వాక్‌'ను స్ఫూర్తిగా తీసుకుని ఆయ‌న అడుగులో అడుగేస్తూ డివిజ‌న్ ప‌రిధిలో నెల‌కొన్న స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మార్నింగ్ వాక్ 34 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ప‌లు కాల‌నీల‌వాసులు, స్థానిక నాయ‌కులు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, త్రినేత ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాధవరం నర్సింగ్ రావు, గంగం శివశంకర్, ఉమేష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed