మీరు WhatsApp గ్రూప్ అడ్మినా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా!

by Dishanational2 |
మీరు WhatsApp గ్రూప్ అడ్మినా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా!
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏది అంటే అందరూ టక్కున చెప్పే ఆన్సర్ వాట్సాప్. ఇది అంతలా ప్రాచుర్యం పొందింది. నిత్యం కోట్లాదిమంది ఈ యాప్‌లో సందేశాలు, వీడియోలు, ఫొటోస్ షేర్ చేసుకోవడమే కాదు ఏకంగా డబ్బులు కూడా పంపుకునేల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. అలాగే గ్రూప్ మెసేజింగ్‌ల కోసం ఇదే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్ ఫామ్.. ఫ్యామిలీ సభ్యులు, గల్లీలో ఉండే వారు, ఆఫీసు సహచరులు, పాత స్నేహితులు, ఒకే చోట పనిచేసే ఉద్యోగులు ఇలా ఎవరైనా ఒక సమూహంగా ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ వాట్సాప్ ద్వారా ఒకే ప్లాట్ ఫామ్ మీద తమ భావాలను, బాధలను, సంతోషాలను, అనందాలను, సమాచారాన్ని షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీంతో ఈ యాప్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఎందులో అయినా మంచితో పాటు చెడు కూడా ఉంటుందన్నది కాదనలేని సత్యం.

గ్రూప్ ఆడ్మిన్ లపైనే భారమంత..

వాట్సప్ లో ఎవరైనా గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. అందుకు ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు. ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేస్తారో వారే అడ్మిన్‌గా ఉంటారు. గ్రూప్‌లో వచ్చే మంచి, చెడులకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్రియేటర్ పర్మిషన్ ఇస్తే వేరే వారు కూడా అడ్మిన్‌గా ఉండే అవకాశం ఉంది. వారు కొత్తవారిని సభ్యులుగా చేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఇలా ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో 256 మందిని చేర్చుకునే వీలుంది. సభ్యులు పంపే మెసేజ్ అందరికీ ఉపయోగపడేలా, ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలకు చోటులేకుండా, మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఉండాల్సి ఉంటుంది. అలా ఎవరైనా సభ్యులు ప్రవర్తిస్తే వారిని గ్రూప్ నుండి తొలగించే అధికారం అడ్మిన్‌కు ఉంటుంది. కానీ వాటిని చూస్తూ మిన్నకుంటే అడ్మిన్ లపై సైబర్ యాక్ట్ కింద పోలీసులు చర్యలు తీసుకునే ఆస్కారం లేకపోలేదు. వీటికి సదరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యుడు అవుతాడు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గ్రూప్ క్రియేటర్ ఒకరు.. నడిపించేది వేరొకరు..

సాధారణంగా ఎవరు గ్రూప్ క్రియేట్ చేస్తే వారే దాన్ని నిర్వహణ చూస్తుంటారు. కానీ కొందరు క్రియేటర్లు తమతో పాటు మరికొందరిని కూడా అడ్మిన్‌గా ఉంచుతుంటారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఏకంగా ఈ పంచాయతీ పోలీసు స్టేషన్ వరకు చేరి కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇందుకు తార్కాణం. తాము ఎంతో కష్టపడి అందరి నెంబర్స్ సేకరించి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే వేరొకరు అడ్మిన్ అడిగారని ఇస్తే ఏకంగా తమనే గ్రూప్ నుండి రిమూవ్ చేశారంటూ బాధితులు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలో ఈ తరహా కేసు మొట్ట మొదటిది అయి ఉండవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో మీరే అడ్మిన్ గా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా మనకు కావాల్సిన వారికి, అత్యంత సన్నిహితులకు, నమ్మకస్తులకు మాత్రమే అదనపు అడ్మిన్ గా బాధ్యతలు అప్పగించండి. గ్రూప్ లో ఎవరు ఎలాంటి మెసేజ్‌లు చేస్తున్నారు. వాటి వల్ల ఎవరికైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. ఎవరైనా ఇబ్బందికర మెసేజ్‌లు పెడితే సదరు వ్యక్తిని సున్నితంగా హెచ్చరించడం, లేదా గ్రూప్ నుండి రిమూవ్ చేయడం కానీ చేయండి. గ్రూప్ మెంటనెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. అప్పుడే మీరూ మీ వాట్సాప్ గ్రూప్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు


Next Story