బాధితులే బలి పశువులా?

by Disha Web Desk 12 |
బాధితులే బలి పశువులా?
X

దిశ, సిటీబ్యూరో : తమకు అన్యాయం జరిగిందంటూ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లి మొరపెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన బాధితులనే కమిషన్ ముందు బలిపశువులను చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించబడ్డ 12 మంది కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టి, నివేదికలను సమర్పించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ గత సంవత్సరం జనవరిలో జీహెచ్ఎంసీకి ఆదేశాలిచ్చింది.

ఏడాది గడిచినా ఆ ఆదేశాలను పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు శనివారం బల్దియా ఆఫీసుకు వచ్చిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్‌ను వ్యూహాత్మకంగా తప్పుదోవపట్టించినట్లు చర్చ జరుగుతుంది. 12 మంది బాధిత కార్మికులను విధుల్లో నుంచి తొలగించేందుకున్న కారణాన్ని తెలియజేస్తూ కమిషన్‌కు బల్దియా ఒక్క లేఖ కూడా రాయకుండానే, శనివారం వచ్చిన కమిషన్‌తో కార్మికులదే తప్పున్నట్లు చూపేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

గత సంవత్సరం శేరిలింగంపల్లిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంటమాలజీ విభాగానికి చెందిన కార్మికుడితో బాత్ రూమ్‌లను కడిగించిన ఘటన గురించి గానీ, చార్మినార్ సర్కిల్ ఆఫీసులోని ఓ విభాగంలో దళిత వర్కర్లకు నో ఎంట్రీ పెట్టిన విషయాలు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ దృష్టికి రాకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి కార్మికుల సమస్యలను జీహెచ్ఎంసీ అధికారులు పరిష్కరించకపోగా, కమిషన్ ముందు బాధితులనే మరోసారి బలిపశువులను చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నం చేసిందన్న వాదనలున్నాయి.

లేఖ రాసిన వారికే సమాచారం లేదు..

12 మంది కార్మికులను చిన్నచిన్న కారణాలతో విధులో నుంచి తొలగించినట్లు జాతీయ కమిషన్‌కు 23 డిసెంబర్ 2021న లేఖ రాసిన బీజేపీ సిటీ మజ్దూర్ మోర్చా చైర్మన్ ఊదరి గోపాల్‌కు సైతం కమిషన్ రాకకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు సమాచారమివ్వలేదన్న విమర్శలున్నాయి. ఈ లేఖకు స్పందించే జనవరి 14 2022న కమిషన్ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖ రాసింది. కానీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు, జీహెచ్ఎంసీలో కార్మిక సంఘాల నేతలకు సమాచారమిస్తే కమిషన్‌కు తమపై ఫిర్యాదులు చేస్తారని భావించి కమిషన్ రాకకు సంబంధించి వారికి సమాచారమివ్వలేదని సమాచారం.



Next Story

Most Viewed