పెద్ద అంబ‌ర్ పేట‌లో భారీగా పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత

by Ratna Kumari |

పేదలకు అందాల్సిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను కంటోన్మెంట్​, ఉప్పల్ ఎస్​వోటీ పోలీసులు హయత్‌నగర్‌లో పట్టుకున్నారు.

పెద్ద అంబ‌ర్ పేట‌లో భారీగా పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత
X

దిశ, వనస్థలిపురం : పేదలకు అందాల్సిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను కంటోన్మెంట్​, ఉప్పల్ ఎస్​వోటీ పోలీసులు హయత్‌నగర్‌లో పట్టుకున్నారు. ఈ ఆపరేషన్​లో సుమారు 19 టన్నుల (380) బస్తాల పీడీఎస్ బియ్యంతో పాటు రెండు లారీలు, ఒక మినీ వ్యాన్, రెండు బైక్​లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు షేక్​ అఖిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హయత్​నగర్​ సీఐ నాగరాజ్​గౌడ్​ వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్​పేట.. ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఫిస్తా హౌజ్ సమీపంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా డంప్​ చేసి.. మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


మినీ వెహికల్​ నుంచి లారీల్లోకి బియ్యాన్ని మార్చుతున్న సమయంలో సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌కు చెందిన సిద్దిక్ భాయ్ అనే పాత నేరస్థుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలకు సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షేక్​ అఖిల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ నాగరాజ్​గౌడ్​ తెలిపారు.

Next Story