చార్మినార్ వద్ద ముస్లింల నిరసన.. పాతబస్తీలో భారీ పోలీస్ బందోబస్తు

by Web Desk |
చార్మినార్ వద్ద ముస్లింల నిరసన.. పాతబస్తీలో భారీ పోలీస్ బందోబస్తు
X

దిశ, చార్మినార్: యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘాలు పాతబస్తీలోని చారిత్రాత్మక మక్కామసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి, శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 70 మంది ముస్లింలు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత షాలిబండా డివిజన్ మజ్లిస్ కార్పొరేటర్ ముజఫర్ ఆలీ ఆధ్వర్యంలో మక్కా మసీదు నుంచి చార్మినార్ వరకు ర్యాలీ చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ''అసద్ భాయ్ జిందాబాద్.. మోడీ ముర్దాబాద్'' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం దక్షిణమండలం పోలీసులు చార్మినార్ వద్దకు చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పి అక్కడినుంచి వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో దక్షిణమండలం డీసీపీ గజారావు భూపాల్ ఆధ్వర్యంలో ఆర్ఎఎఫ్, టీఎస్‌ఎస్‌పీ, టాస్క్‌ఫోర్స్ బలగాలతో పాటు టియర్ గ్యాస్, వజ్రవాహనాలతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పాతబస్తీలోని చార్మినార్, మదీన, పత్తర్ గట్టి, గుల్జార్ హౌజ్, షహ్రాన్ మార్కెట్, లాడ్ బజార్ తదితర ప్రాంతాల్లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసి నిరసన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed