'వారిని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ప్రసంశించారు'

by Web Desk |
వారిని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ప్రసంశించారు
X

దిశ, చార్మినార్: భారతీయ ఉర్దూ సాహిత్యంలో మగ్దూం మొహియుద్దీన్ ఒక ధృవతార అని ప్రభుత్వ సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఐజా సుల్తానా అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాలలో నిర్వహించిన మగ్దూం మోహియుద్దీన్ జయంతి సభలో డాక్టర్ ఐజా సుల్తానా మాట్లాడుతూ.. మగ్దూం ప్రఖ్యాత కవిగానే కాకుండా గొప్పనాటక కర్తగా కూడా దేశంలోని పండితుల మన్ననలు అందుకున్నారని అన్నారు. బెర్నాడ్ షా నాటకాన్ని మగ్దూం ఉర్దూలోకి అనువదించి హైదరాబాద్‌లో ప్రదర్శించారని, ఆ ప్రదర్శన చూసి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ప్రసంశించారాని గుర్తుచేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ్ దత్ శుక్లా మాట్లాడుతూ.. మగ్దూం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితమైన పాత్ర పోషించారని అన్నారు. కవిగా, ఉద్యమ కారుడిగా, కార్మిక నాయకునిగా, అనువాదకునిగా, ఎమ్మెల్యేగా మగ్దూం అందించిన సేవ ఎప్పటికీ మరువరానిదని, ఆదర్శనీయమైనదని కొనియాడారు. కొంతకాలం సీటీ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహించిన మగ్దూం, ఉర్దూ శాఖ విస్తృతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. హైదరాబాద్‌లో అభ్యుదయ సాహిత్యానికి కేంద్రబిందువుగా వెలుగొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉర్దూ శాఖ అధ్యక్షులు డాక్టర్ రిజ్వానా బేగం, అర్థశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు లతారాణి, డా.కృష్ణవేణి, డా. రవి కుమార్ చేగోని, డా. కోయి కోటేశ్వరరావు, డా.కమల సుధారాణి, తబస్సుమ్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Next Story