ఐఏఐసీసీతో తెలంగాణకు పెట్టుబడులు: జయేష్ రంజన్

by Disha Web Desk 11 |
ఐఏఐసీసీతో తెలంగాణకు పెట్టుబడులు: జయేష్ రంజన్
X

దిశ, ఖైరతాబాద్: ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏఐసీసీ)తో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఐఏఐసీసీ హైదరాబాద్ నూతన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అమీర్ పేట్ లోని మ్యారిగోల్డ్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఐఏఐసీసీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కుమార్, తెలంగాణ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ చైర్మన్ దీక్షిత్, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సురేష్ రాయుడు లతో కలిసి మాట్లాడారు.

ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరిచే ఒక స్థిరమైన నాయకత్వ వేదిక అని అన్నారు. ఇది 1990లో వాషింగ్టన్ డీసీలో స్థాపించబడిందని తెలిపారు. అటువంటి శాఖను హైదరాబాదులో నెలకొల్పడం ఎంతో సంతోషకరమని అన్నారు.

భారతదేశానికి అమెరికాకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వందలాది యునైటెడ్ స్టేట్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయని తెలిపారు. ఈ నూతన శాఖ హైదరాబాద్ చాప్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు మరింత అధికమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story