- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్రాష్ట్ర మొబైల్ చోరీ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ నగరంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మొబైల్ ఫోన్ చోరీలు, జేబు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేర ముఠాను కంచన్బాగ్ పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో అదుపులోకి తీసుకున్నారు.

దిశ, చంపాపేట్ : హైదరాబాద్ నగరంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మొబైల్ ఫోన్ చోరీలు, జేబు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేర ముఠాను కంచన్బాగ్ పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక విశ్లేషణ, ఫీల్డ్ స్థాయి సమాచారంతో నడిపిన ఆపరేషన్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లు, విడిభాగాలు, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గత నెల డీఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన ఖరీదైన మొబైల్ ఫోన్ స్నాచింగ్తో వెలుగులోకి వచ్చింది. సయ్యద్ నజీర్ అహ్మద్ వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 మొబైల్ ఫోన్ను అపహరించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కంచన్బాగ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో నిందితుల కదలికలను సీసీ కెమెరాల ద్వారా విశ్లేషించడంతో పాటు, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలను పరిశీలించి ముఠా కార్యకలాపాలను వెలికితీశారు. ఈ ముఠా హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. అరెస్టైన నిందితులు అంబట నరేష్, బనాల అరుణ్ కుమార్, మేకల చిరంజీవి, తోట సూరి, తోట చందు, సందీప్ జైస్వాల్. వీరిలో సందీప్ జైస్వాల్ దొంగిలించిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి విక్రయించే కీలక రిసీవర్గా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు. తోట వసంత్, శశి, ప్రేమ్ తదితరులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసుల విచారణలో ఈ ముఠా బస్టాండ్లు, మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రద్దీ రోడ్ల వద్ద ప్రజలను లక్ష్యంగా చేసుకునేదని తేలింది. కొందరు బాధితులను గమనిస్తే.. మరికొందరు చుట్టుముట్టి దృష్టి మళ్లించేవారు. అనంతరం పత్రికలు, ప్లాస్టిక్ కవర్లతో చేతులను కప్పి క్షణాల్లో మొబైల్ ఫోన్లను అపహరించేవారు.
దొంగిలించిన ఫోన్లను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయించేవారని, కొన్ని ఫోన్లను విడదీసి బ్యాటరీలు, కెమెరాలు, ఇతర విడిభాగాలుగా మార్చి మొబైల్ రిపేర్ దుకాణాలకు అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 132 మొబైల్ బ్యాటరీలు, 172 మొబైల్ బాడీలు, 73 కెమెరా మాడ్యూల్స్, ఆపిల్ ఐఫోన్ , ఓన్ప్లస్ స్మార్ట్ఫోన్స్ , వివో స్మార్ట్ఫోన్స్ , శాంసంగ్ గెలాక్సీ తదితర బ్రాండ్లకు చెందిన అనేక మొబైల్ ఫోన్లు, ఒక బజాజ్ పల్సర్ బైకు ఉన్నాయి. అరెస్టైన నిందితుల్లో చాలా మంది పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక చోరీ, మోసం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన కంచన్బాగ్ పోలీస్ బృందాన్ని రాజేంద్రనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక నైపుణ్యం, వేగవంతమైన దర్యాప్తుతో అంతర్రాష్ట్ర నేర ముఠాను పట్టుకోవడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, షర్ట్ జేబుల్లో ఖరీదైన ఫోన్లు పెట్టుకోవద్దని పోలీసులు సూచించారు. బిల్లులు లేకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.






