మాయ మాట‌లు న‌మ్మ‌వ‌ద్దు: హైడ్రా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-09 17:55:58  IST  )

దళారీల మాయ మాట‌లు న‌మ్మ‌వ‌ద్దని హైడ్రా తెలిపింది...

మాయ మాట‌లు న‌మ్మ‌వ‌ద్దు: హైడ్రా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు భూముల‌కు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు, ప్ర‌భుత్వ భూముల‌లో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగితే ఊరుకోద‌ని తేల్చి చెప్పింది. తుక్కుగూడ మున్సిపాలిటీలోని వ‌ర్టెక్స్ రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు - చైత‌న్య రెడ్డి అనే మ‌హిళ‌కి మ‌ధ్య ఉన్న వివాదం పూర్తిగా ప్రైవేటు వ్య‌వ‌హార‌మ‌ని పేర్కొంది. దీని సంబంధించి అందిన ఫిర్యాదు నేప‌థ్యంలో ఇరుప‌క్షాల‌ను ఎదురెదురుగా పెట్టి ఎంతో పార‌ద‌ర్శ‌కంగా హైడ్రా విచారించింది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న భూ త‌గాదాలో హైడ్రా త‌ల దూర్చ‌ద‌ని హైడ్రా స్ప‌ష్టం చేసింది. సూరం చెరువులో వ‌ర్టెక్స్ సంస్థ అక్ర‌మ నిర్మాణాలు చేప‌డితే వాటిని హైడ్రా కూల్చి వేసింది.

కొత్తకుంట‌ చెరువులో వ‌ర్టెక్స్ సంస్థ మ‌ట్టి పోయ‌డాన్ని హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. ఈమేర‌కు వ‌ర్టెక్స్‌పై రెండు కేసులు కూడా న‌మోదు చేసింది. వాస్త‌వాలు ఇలా ఉంటే.. హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొల‌గించ‌బ‌డి.. సాంకేతిక కార‌ణాల‌తో స్టే తెచ్చుకున్న సుంక‌రి న‌రేష్ లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ ఆ విష‌యాల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డాన్ని హైడ్రా ఖండించింది. చైత‌న్య‌రెడ్డి పేర్కొన్న విధంగా .. ఆమెకు చెందిన భూమిలోంచి వ‌ర్టెక్స్ సంస్థ ర‌హ‌దారి వేసిన వివాదంలో.. ఆ ఇరువురే తేల్చుకోవాలి. ఈ విష‌య‌మై చైత‌న్య రెడ్డి ఇదివ‌ర‌కే పోలీసు స్టేష‌న్‌లో వ‌ర్టెక్స్‌పై కేసు కూడా పెట్టారు. న్యాయం కోసం కోర్టును కూడా ఆశ్ర‌యించ‌వ‌చ్చు. త‌న నుంచి రూ. 50 ల‌క్ష‌లు తీసుకున్నారంటూ సుకంక‌రి న‌రేష్‌తో పాటు ద‌ళారీలుగా వ్య‌వ‌హ‌రించిన వారిపై చైత‌న్య రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు చైత‌న్య‌రెడ్డితో పాటు.. ద‌ళారీగా ఆమె పేర్కొన్న వ్య‌క్తిని కూడా ఎదురెదురుగా పెట్టి విచారించింది. ఈ విష‌య‌మై మ‌రింత లోతుగా ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌హాడీష‌రీఫ్ పోలీసు స్టేష‌న్లో హైడ్రా కేసు పెట్టింది.

కోర్టు బార్ కౌన్సిల్ తొల‌గించిన త‌ర్వాత స్టే తెచ్చుకున్న వ్య‌క్తికి.. న్యాయ‌వాదిగా ఫీజు చెల్లించింద‌ని సుంక‌రి న‌రేష్‌ పేర్కొన‌డం కూడా గ‌మ‌నార్హం. వ‌ర్టెక్స్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని హైడ్రాపై గ‌తంలో బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించిన సుంక‌రి న‌రేష్ మంగ‌ళ‌వారం మ‌రో సారి లేని పోని ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని హైడ్రా ఖండించింది. ఈ ద‌ళారీ వ్య‌వ‌హారంపై పోలీసులు లోతుగా విచారించి నిజాలు నిగ్గు తేల్చుతార‌ని హైడ్రా ఆశిస్తోంది. జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని.. ద‌ళారీల మాయ మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. వారి చేతిలో మోస‌పోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

Next Story