గ్రేటర్ ప్రజలకు తప్పని కుక్కల బెడద.. పట్టించుకోని అధికారులు

by Disha Web Desk 13 |
గ్రేటర్ ప్రజలకు తప్పని కుక్కల బెడద.. పట్టించుకోని అధికారులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో అసువులు బాసిన నాలుగేళ్ళ ప్రదీప్ సంఘటన అనంతరం నగరంలో అలాంటివే పునరావృతం కావడం వంటివి చోటు చేసుకుంటుండడంతో ప్రజలు బల్దియా తీరుపట్ల మండిపడుతున్నారు. పిల్లల ప్రాణాలు పోతున్నా మేయర్‌తో సహా ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఓ చోట సంఘటనలు జరుగుతున్నా మేయర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని, దీంతో బస్తీలలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలియకపోగా ప్రజలకు కుక్కల బెడద తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంపులుగా రోడ్ల మీదనే..

అంబర్ పేట సంఘటన అనంతరం హడావుడిగా సమావేశాలు ఏర్పాటు చేసి కుక్కల బెడద తొలగిస్తామని చెప్పిన అధికారులు అనంతరం పట్టించుకోకపోవడంతో గ్రేటర్ రోడ్లు, బస్తీలలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు గుంపులుగా కనబడుతున్నాయి. దీంతో అటుగా వెళ్లాలంటేనే పిల్లలతో సహా పెద్దలు కూడా భయపడుతున్నారు. గత వారం రోజులుగా నగరంలో గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు చిన్నారులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మిగిలిన ఆహారం పెట్టడం వల్లనే..?

ఇండ్లలో మిగిలిన ఆహారాన్ని కుక్కలకు పెట్టడం వల్లనే అవి బస్తీలలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని బస్తీల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తపేట డివిజన్ మారుతి నగర్‌లో నాలుగు రోజుల క్రితం పరిమళ క్లాసిక అపార్ట్ మెంట్లో వాచ్ మెన్‌గా పనిచేసే భాగ్యలక్ష్మి, బాలు దంపతుల కొడుకు రిషి(4 )ని వెంబడించి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీనికి ఎదురుగా ఉన్న మరో అపార్ట్ మెంట్లో నివసించేవారు.. ప్రతిరోజు ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలను అపార్ట్ మెంట్ ముందు పెట్టడంతో ఈ కాలనీలో కుక్కల బెడద రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోందని స్థానికులు తెలిపారు.

ఆహార పదార్థాలు పెట్టవద్దని గత ఆరు నెలలుగా వారికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకపోగా మా ఇష్టం పెడతాం.. కుక్కలను ఏమైనా అంటే పోలీస్ కేసు పెడతామని దబాయిస్తున్నారని వారు వాపోయారు. బస్తీలలో ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ, వెటర్నరీ శాఖ పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో పర్యటించాలి..

నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కుక్కలను పట్టుకోవడం వాటిని దాడులకు పాల్పడకుండా వాటిని నిర్మూలించే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని మారుతీనగర్ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. మారుతీనగర్‌లో రుషిని వెంబడించి గాయపరిచిన చోటే కుక్కలు గుంపులుగా కనబడుతున్నాయి.

దీంతో కాలనీ వెంట ప్రయాణించే చిన్నారులు, మహిళలు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వీధి కుక్కల కారణంగా దయానియంగా తయారైంది. స్కూలుకు వెళ్లి వచ్చే విద్యార్థులు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కు మన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని మాత్రం విడకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి వీధి కుక్కల భారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

కొత్తపేటలో మరో సంఘటన..

ఎల్బీ నగర్ కొత్తపేట లోని జనప్రియ అపార్ట్ మెంట్ వద్ద శ్రీ సాయి దీక్షిత్ అనే బాలుడిని వీధి కుక్కలు వెంటపడి గాయపరిచాయి. బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో కుడికాలుపై పలు చోట్ల గాట్లు పడ్డాయి. కుక్కలు దాడి చేయడాన్ని గమనించిన స్థానికులు వాటిని అక్కడి నుండి తరిమివేశారు. బాలుని తల్లిదండ్రులు చిరు వ్యాపారం చేస్తుంటారు.

Next Story

Most Viewed