ప్రైవేటీకరణ దిశగా జీహెచ్ఎంసీ..! పెరుగుతున్న పొరుగు సేవలు

by Shiva Kumar |
ప్రైవేటీకరణ దిశగా జీహెచ్ఎంసీ..! పెరుగుతున్న పొరుగు సేవలు
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించగా మున్ముందు మరిన్ని సేవలు ప్రైవేటు పరం కానున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీకి నేరుగా నిధులను సమకూర్చే సేవలను సైతం ప్రైవేటు పరం చేయటంపై పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్ల అప్‌డేట్ చేసే బాధ్యతలను ఇప్పటికే ఆస్పత్రులకు అప్పగించారు. సీఆర్ఎంపీకి రూ.1,800 కోట్లకు నగరంలోని సుమారు 800 కి.మీ రోడ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించినా జీహెచ్ఎంసీయే రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సి వస్తోంది. ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయినా సీఆర్ఎంపీకి చెల్లింపులు మాత్రం సకాలంలో జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈఈఎస్ఎల్ చేపడుతున్న సంగతి తెల్సిందే.

పేరు రాంకీది.. పనులు చేసేది బల్దియానే

పారిశుధ్య పనులను దశాబ్దం క్రితమే రాంకీ సస్టైనబుల్‌కు అప్పగించారు. అదే అగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం ఒక మెట్రిక్ టన్ను చెత్తకు జీహెచ్ఎంసీ రూ.2,100 చెల్లిస్తోంది. ఈ రకంగా ప్రతి రోజూ కనిష్ఠంగా ఆరు వేల మెట్రిక్ టన్నులు, గరిష్ఠంగా ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల చెత్తను రాంకీ తరలించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ మిషనరీ, మ్యాన్ పవర్‌ను వినియోగిస్తూ రాంకీ చేయాల్సిన పనులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 3,250 స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులే డోర్ టూ డోర్ చెత్తను సేకరిస్తున్నారు. చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే రాంకీ మిషనరీ, మ్యాన్ పవర్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య బాధ్యతలు రాంకీకి అప్పగించి ఏం ప్రయోజనం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏఏ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించవచ్చన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

వివాదాలు రేపుతున్న నిబంధన

కమర్షియల్ కాంప్లెక్సులు పెరుగుతున్నా, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. అసలు ఎన్ని కేటగిరీల కింద ట్రేడ్ లైసెన్సులు జారీ చేశారన్న సమాచారం అధికారుల వద్ద లేదు. గతంలో ట్రేడ్ లైసెన్సుల జారీ, రెన్యువల్ బాధ్యతలు మెడికల్ ఆఫీసర్లు నిర్వర్తించేవారు. ఈ సేవ కేంద్రాలకు అప్పగించిన తరువాత రెన్యువల్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వ్యాపారులు సిబ్బందిని మేనేజ్ చేసుకుని కొత్త లైసెన్సులు తీసుకుంటున్నారు. ట్రేడ్ లైసెన్సుల రెన్యువల్, రెంటల్ డీడ్ మస్టుగా నిబంధన పెట్టారు. ప్రతి సంవత్సరం టెనెంట్లు టెనెంట్ అగ్రిమెంట్ కాపీని సమర్పించాల్సి ఉండేది. ఇరుగుపొరుగు ఆస్తుల యజమానులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తే కానీ లైసెన్సులు రెన్యువల్ అయ్యేవి కావు. ప్రస్తుతం టెనెంట్ అగ్రిమెంట్ లేకుండానే రెన్యువల్ చేస్తుండటంతో వివాదాలు తలెత్తుతున్నాయి. టెనెంట్లు ఓనర్లను పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎక్కువ మాట్లాడితే కోర్టుకెళ్తామని బెదిరిస్తుండటంతో ఓనర్లు ఆందోళనకు గురవుతున్నారు.



Next Story

Most Viewed