‘చెత్త’ మాఫియా.. కార్మికుల కడుపులు కొడుతున్న వైనం!

by Disha Web Desk 7 |
‘చెత్త’ మాఫియా.. కార్మికుల కడుపులు కొడుతున్న వైనం!
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ గ్రేటర్ ప్రజలకు అందించే ముఖ్యమైన సేవల్లో శానిటేషన్ ఒకటి. కానీ ఈ శానిటేషన్ ఇప్పుడు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ సర్కిలో శానిటేషన్‌కు సంబంధించి వెలుగుచూస్తున్న అక్రమాలు, అవినీతిలో సర్కిల్ మొదలుకుని జోనల్ అధికారులతో పాటు పలువురు కార్పొరేటర్ల హస్తమున్నట్లు వెల్లడవుతుండటం గమనార్హం. కొన్ని సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు, మెడికల్ ఆఫీసర్లు, మరికొన్ని సర్కిళ్లలలో వీరితో పాటు జోనల్ కమిషనర్లు మాఫియాగా ఏర్పడి కార్మికుల శ్రమను దోచుకోవటంతో పాటు విధుల్లో నుంచి వారిని తొలగించి, వారి పోస్టుకు లక్షల రూపాయల్లో వెలకట్టి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి జీతం లేకపోయినా, ఇంటింటి నుంచి చెత్తను సేకరించే స్వచ్ఛ కార్మికుల కడుపులు కొట్టేందుకు కార్పొరేటర్లు, అధికారులు సిద్దమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నగరంలో సుమారు 22 లక్షల గృహాలున్నట్లు తేలటంతో చెత్తను సేకరించే కార్మికులు లక్షల్లో సంపాదిస్తున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేని అధికారులు వారిని రకరకాలుగా లంచాల కోసం వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే కార్మికులకు ఒక్కో ఇంటి యజమాని బస్తీల్లో రూ.50, కాలనీల్లో రూ.వంద చెల్లించాలన్న మౌఖిక ఆదేశాల మేరకు ఆ కార్మికులు ఇంటి యజమానులిచ్చే ఛార్జీలతోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

కాప్రా సర్కిల్‌లోని మోడీ అపార్ట్‌మెంట్‌లో 25 ఏళ్ల నుంచి చెత్తను సేకరిస్తూ, తద్వారా వచ్చిన జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్న స్వచ్ఛ కార్మికుడిని కార్పొరేటర్, అధికారులు కలిసి విధుల్లో నుంచి తొలగించి, రూ.5లక్షల బేరం కుదుర్చుకుని వేరే వ్యక్తిని నియమించినట్లు సమాచారం. దీంతో స్వచ్ఛ కార్మికుడి కుటుంబం బతుకుదెరువు లేకుండా రోడ్డునపడింది. ఎలాంటి జీతం లేకపోయినా, మహానగరాన్ని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్మికులను ఏసీ గదుల్లో కూర్చోని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఈ రకంగా రోడ్డునపడేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది.

కార్మికుడు మారగానే రేటు పెంచేశారు

25 ఏళ్లుగా చెత్తనే నమ్ముకుని, చెత్త సేకరణతో వచ్చే జీతంతోనే జీవితం గడిపిన స్వచ్ఛ కార్మికుడిని విధుల్లో నుంచి తొలగించి, వేరే వ్యక్తి వద్ద రూ.5 లక్షలు తీసుకుని కొత్త కార్మికుడిని నియమించిన తర్వాత ఒక్కో ఫ్లాట్ నుంచి చెత్తను సేకరించేందుకు నెలకు రూ.200 ఫీజుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక, ఈ సర్కిల్‌లోని మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమినషర్లకు ప్రతి స్వచ్ఛ ఆటో టిప్పర్ నెలకు రూ.5 వేల మామూళ్లు చెల్లించాలన్న నిబంధనను కూడా అమలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే పనిచేసిన కార్మికుడు రూ.50, వంద ఇచ్చినా తీసుకునే ఆనందంగా పని చేసేవారని, గతంలో ఇచ్చిన విధంగానే ఛార్జీలు ఇస్తామని కొందరు ఫ్లాటు యజమానులు తేల్చి చెప్పటంతో, వారి ఇళ్ల నుంచి చెత్త సేకరించటం మానేసి, వారిని కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


Next Story