ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి రవాణా

by Vemula.Srinu Prasad |

ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో గుట్టుగా సాగుతున్న గంజాయి రవాణాను రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు, ఈగిల్ ఫోర్స్ సంయుక్తంగా రట్టు చేశాయి. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు బస్సులో తరలిస్తున్న సుమారు 41 కిలోల గంజాయిని ఆటోనగర్ సమీపంలో పట్టుకుని సిబ్బందిని అరెస్ట్ చేశారు....

ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి రవాణా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో గుట్టుగా సాగుతున్న గంజాయి రవాణాను రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు, ఈగిల్ ఫోర్స్ సంయుక్తంగా రట్టు చేశాయి. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు బస్సులో తరలిస్తున్న సుమారు 41 కిలోల గంజాయిని ఆటోనగర్ సమీపంలో పట్టుకుని సిబ్బందిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో జులై 11న మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం వద్ద ఒడిశాకు చెందిన బాబా బోలోనాథ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీ చేశారు. రెండు బ్యాగుల్లో దాచిన రూ.20.5 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది.

కమీషన్‌కు ఆశపడి బస్సు సిబ్బందే స్మగ్లర్లతో చేతులు కలిపినట్లు దర్యాప్తులో తేలింది. ఒడిశాకు చెందిన బస్సు డ్రైవర్ కోమల ఖిల్, కండక్టర్ బుబు మడకమి, హెల్పర్ లక్ష్మణ్ కురమిలను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు. గంజాయి పంపిన మల్కన్‌గిరికి చెందిన నుబిన్, హైదరాబాద్‌కు చెందిన గుర్తుతెలియని రిసీవర్ కోసం రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు గాలిస్తున్నారు. బస్సు సిబ్బంది మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ పట్టుబడటం ఇది మూడోసారి. గతంలో మే 21న బంకేశ్వరి ట్రావెల్స్ బస్సులోనూ 21 కిలోల గంజాయి పట్టుబడింది.

ప్రైవేట్ బస్సు యజమానులు తమ వాహనాలపై నిఘా ఉంచాలని పోలీసులు హెచ్చరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే 1908 లేదా వాట్సాప్ 8712671111కు తెలపాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం ఇస్తామని డ్రగ్స్ రహిత తెలంగాణ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఫోర్స్ కోరింది.

Next Story