పెండింగ్‌ పనులపై నజర్.. ఎన్నికలే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలు

by Disha Web Desk 12 |
పెండింగ్‌ పనులపై నజర్.. ఎన్నికలే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలు
X

దిశ, సిటీ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తుండటంతో మహానగరంలో జీహెచ్ఎంసీ చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెండింగ్ పనులపై సర్కారు దృష్టి సారించినట్లు సమాచారం. ఆయా దశల్లో ఆగిపోయిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. కానీ నిధులు పుష్కలంగా ఉన్నప్పుడు పనులు చేపట్టడంలో విఫలమైన జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు సర్కారు ఆదేశాలతో పనులు చేపడుదామన్నా నిధులు లేకపోవటంతో తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల రూ. 500 కోట్ల అప్పు కోసం అధికారులు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, ఫలితం దక్కలేదు. పైగా నిధుల్లేవన్న విషయం సర్కారుకు వినిపించేందుకు కూడా అధికారులు జంకుతున్నారు.

కానీ సర్కారు ఆదేశించడంతో తాము ఏదో పని చేస్తున్నామని నమ్మించేందుకు చిన్న చిన్న మెయింటెనెన్స్ పనులు చేయిస్తున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉప్పల్, మెహిదీపట్నం జంక్షన్లలో పాదాచారుల భద్రత కోసం సుమారు రూ. వంద కోట్లతో ఏర్పాటు చేసిన రెండు స్కైవేలను వీలైనంత త్వరగా పాదచారులకు అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రయత్నాలు చేస్తుంది. ఇక జీహెచ్ఎంసీ కూడా ఇప్పటికే ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేసింది. ఎస్ఆర్ డీపీ కింద ఇంకా జరుగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని సర్కారు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మంత్రి మళ్లీ పొడిగిస్తారా? ప్రశ్నిస్తారా?

హైదరాబాద్ మహానగరాన్ని రెండేళ్ల క్రితం అకాల వర్షాలు ఆగమాగం చేసిన నేపథ్యంలో మహానగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు స్ట్రాటెజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్ డీపీ)ని ప్రకటించి, దానికి రూ. 958 కోట్ల పరిపాలన మంజూరీ ఇవ్వటంతో ప్రారంభమైన పనులు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులను మంజూరు కాగా, వీటిలో ఒకటి మినహా మిగిలిన పనులన్నీ ప్రారంభించారు. ఇప్పటి వరకు వరద నివారణ పనులు రెండు మాత్రమే పూర్తికావటంతో జీహెచ్ఎంసీ ఇంజనీర్ల పని తీరుకు నిదర్శనం.

2021 జూన్ లో మంత్రి కే. తారక రామారావు ఈ ప్రాజెక్టును ప్రకటించినా, నేటికీ పనులు పూర్తి కాకపోవడం, మంత్రి ఎప్పటికప్పుడు గడువును పెంచుతూ వస్తు న్నారు. ఇందులో భాగంగానే ఈ ముంపు నివారణ పనులకు మంత్రి విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కానీ పనులు పూర్తి స్థాయిలో చేపట్టలేదు. పూర్తి చేయలేదు. మరో వైపేమో వచ్చే నెల రెండో వారం నుంచి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరికలు వస్తుండటంతో మంత్రి ఈ సారి కూడా డెడ్ లైన్ పొడిగిస్తారా? లేక జీహెచ్ఎంసీ ఇంజనీర్లను గట్టిగా ప్రశ్నిస్తారా? వేచి చూడాలి.


Next Story