ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.. డీఎంఈ ముట్టడికి ఏబీవీపీ యత్నం

by Disha Web Desk 13 |
ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.. డీఎంఈ ముట్టడికి ఏబీవీపీ యత్నం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకునే విధంగా మానసిక వేదనకు, ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కోఠి లోని డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో సుల్తాన్ బజార్ పోలీసులు వారిని గేటు వద్దనే నిలిపి గేటుకు తాళాలు వేశారు. దీంతో అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న సుమారు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రతినిధులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థిని డాక్టర్ ప్రీతి కు న్యాయం చేయాలని, సైఫ్‌తో పాటు కాలేజ్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలన్నారు. డాక్టర్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుండే అక్కడ ఉండే సీనియర్ విద్యార్థి సైఫ్ ఖాన్ వేధింపులు మొదలయ్యాయని.. అవి రోజు రోజుకి శృతిమించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మధుసూదన్, హెచ్‌ఓడీ నాగార్జున రెడ్డి లకు ప్రీతి వెళ్లి ఫిర్యాదు చేయగా.. నిర్లక్ష్యం వహించి చూసీ చూడనట్లు వదిలి వేయడం ఆమె ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేమున్నాం కదా మీరెందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని అక్కడున్న హెచ్ఓడీ ప్రీతిని మందలించడం జరిగిందన్నారు.


ప్రీతి ఆత్మహత్యయత్నానికి పాల్పడే విధంగా చేసినటువంటి కాలేజ్ మేనేజ్ మెంట్‌తోపాటు సైఫ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రీతికి న్యాయం చేయాలని ఏబీవీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి సైఫ్ డాక్టర్ డిగ్రీ ని కూడా రద్దు చేయాలన్నారు. చిన్న చిన్న విషయాలకు ట్వీట్టర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులు అందరికీ మేనమామ లాగా రక్షణగా ఉంటానన్న కేసీఆర్ ఈ సంఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు జీవన్, లా ఫోరం కన్వీనర్, విద్యానగర్ జిల్లా కన్వీనర్ హరి ప్రసాద్, కోఠి జిల్లా కన్వీనర్ కళ్యాణ్, గోల్కొండ జిల్లా కన్వీనర్ శ్రావణ్, గర్ల్స్ కన్వీనర్ సిరివెన్నెల, గోల్కొండ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణి, సైదులు, మధు, అక్షయ్, హరీష్, సజ్జన్, రమేష్, ప్రణయ్, ఇబ్రహీం, చంటి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story