అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు

by Taduka Kalyani |

అధిక వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికి, అమాయక ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసిన 'కిసాన్ పరివార్' సంస్థల నిర్వాహకుడు భూపాల్ నాయక్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు
X

దిశ, శేరిలింగంపల్లి : అధిక వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికి, అమాయక ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసిన 'కిసాన్ పరివార్' సంస్థల నిర్వాహకుడు భూపాల్ నాయక్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కిసాన్ పరివార్, కిసాన్ పరివార్ లిమిటెడ్, కిసాన్ పరివార్ ఇండస్ట్రీస్, షేర్స్ బజార్ పేరిట కంపెనీలను స్థాపించిన భూపాల్ నాయక్, పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించి చివరకు బోర్డు తిప్పేశాడు.​ ఈ భారీ కుంభకోణానికి సంబంధించి గుజరాత్ పోలీసులు గతంలోనే భూపాల్ నాయక్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, పది రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం అతడిని గుజరాత్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడిని గుజరాత్ నుండి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధ్యతలు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు శనివారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడంతో అక్కడ కేసు నమోదు చేశారు. 2022 నుంచి తాము ఈ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నామని, ప్రారంభంలో ఏడాది పాటు సక్రమంగానే వడ్డీలు చెల్లించి, ఆ తర్వాత నమ్మించి ముంచేశారని మీడియా ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘరానా మోసాలు పై స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా 6,000 మంది బాధితులు

​ఈ కుంభకోణంలో దేశవ్యాప్తంగా సుమారు 6,000 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 1,200 మంది వరకు మోసపోయారు. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఈ మోసం సాగింది. కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో ఇందులో పెట్టుబడి పెట్టాను. తీరా వీళ్లు బోర్డు తిప్పేయడంతో వేరే దారి లేక అప్పులు చేసి కూతురి పెళ్లి చేయాల్సి వచ్చింది. మాలాంటి మధ్యతరగతి వాళ్లంతా రోడ్డున పడ్డారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ​కంపెనీల పేరిట వేల కోట్లు వసూలు చేసిన ఈ భారీ స్కామ్‌పై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Next Story