బీజేపీ తెలంగాణలో 17 సీట్లు సాధిస్తుంది

by Disha Web Desk 15 |
బీజేపీ తెలంగాణలో 17 సీట్లు సాధిస్తుంది
X

దిశ, ముషీరాబాద్‌ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 17 సీట్లు కైవసం చేసుకుటుందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం విజయ సంలక్ప యాత్ర నిర్వహించారు. అనంతరం రాంనగర్‌ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీకి ఓటు వేస్తే మునిగినట్లే అన్నారు. గతంలో తొమ్మిది ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కు ఉండగా ఈ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా దక్కించుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఓడితే రాష్ట్రానికి, దేశానికి నష్టం ఏమీ లేదన్నారు. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక అవినీతి కార్యక్రమాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. కాంట్రాక్టర్లను, పారిశ్రామిక వేత్తలను, బిల్డర్లను పిలిపించుకొని రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. అర్హులైన పేదలందరికి గ్యాస్‌ను ఐదు వందల రూపాయలకు, 200 యూనిట్ల లోపు ఉన్న వారందరికి ఉచిత కరెంటు అందించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఒక్కటే దేశానికి, తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం అన్నారు. ప్రధాని మోడీ రాకముందు ఉన్న భారత దేశానికి మోడీ వచ్చిన తరువాత భారతదేశానికి తేడా గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, ఐఎస్‌ఐ ఏజెంట్ల ఆగడాల ఊసే లేదన్నారు. గతంలో ఎక్కడపడితే అక్కడ దేశంలో బాంబు పేల్లుళ్లు,

మత ఘర్షణలు, పాకిస్థాన్‌ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోయేవని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఎవరైనా తోక ఆడిస్తే ఆ తోకను కత్తిరించే పని మోడీ చేపట్టారని కోనియాడారు. దేశం కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం అవినీతి అంతం కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ వ్యాప్తంగా 40 సీట్లు కూడా రావని, బీజేపీ 370కి పైగా సీట్లు గెలవాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. 4వ తేదీన రామగుండంలో పది వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 810 మెగా వాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్‌గౌడ్, అసెంబ్లీ కన్వీనర్‌ రమేష్‌రాం, కార్పొరేటర్లు కె.రవిచారి, సుప్రియనవీన్‌గౌడ్, రచనశ్రీ, పావని వినయ్‌కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి పూస రాజు, రాంరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed