ఆశావహులపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయిలో ప్రైవేట్ సంస్థతో సర్వే

by Disha Web Desk 12 |
ఆశావహులపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయిలో ప్రైవేట్ సంస్థతో సర్వే
X

దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణలో పవర్‌లోకి రావాలనుకుంటున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన అభ్యర్థులనే పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకు తీవ్ర ప్రయత్నాల్లో పార్టీ అధిష్టానం ఉంది. ఒక్కో స్థానం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముందుగా శేరిలింగంపల్లికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద సెగ్మెంట్ అయిన శేరిలింగంపల్లిలో గెలిచి తమ సత్తా చాటాలనుకుంటుంది. ఇక్కడి పరిస్థితులు, నేతల వైఖరి, బలమైన సామాజికవర్గం, బరిలోకి దిగే నేతల బలాబలాలు, కుల ప్రాతిపదికన వచ్చే ఓట్లు, పార్టీ బలం లేకుండా గెలిచే నేతలు .. ఇలా పలు అంశాల ఆధారంగా ఢిల్లీ టీమ్ క్షేత్రస్థాయిలో తిరుగుతూ పలువురిని కలిసి సర్వేలు చేస్తుంది.

సర్వేలో బిజీగా..

మేడం మీరు ఏ పార్టీకి ఓటేస్తారు.? సార్.. ప్రస్తుతం బీజేపీ నేతలతో ప్రజా సంబంధాలు ఎలా ఉన్నాయి.? శేరిలింగంపల్లిలో బీజేపీ టికెట్ ఇస్తే ఏ నేత గెలుస్తారు..? పార్టీ సపోర్ట్ లేకుండా ఎవరి సత్తా ఏంటి..? కులాలు, సామాజిక వర్గాల వారీగా ఎవరికి సపోర్టు ఉంటుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలో ఎవరికి చాన్స్ ఉంది..? వారిని తట్టుకుని జనామోదం పొందే నేత ఎవరు..? బస్తీ బాటలు, పాదయాత్రలతో తమను ప్రమోట్ చేసుకుంటున్నారా..? లేక బీజేపీ కేంద్ర పథకాల గూర్చి చెబుతున్నారా..? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ సర్వేల్లో బిజీగా ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఉంది. బీజేపీ ఢిల్లీ పెద్దలు ఓ నేషనల్ టీవీ ఛానల్ నేతృత్వంలో హైదరాబాద్ కు చెందిన కొందరు సీనియర్ జర్నలిస్టులు, బీజేపీ అనుబంధ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులు కూడా సంస్థతో సర్వే చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా ఇప్పుడే ఏంటన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. సర్వేలో జనం అభిప్రాయానికి ఎక్కువగా విలువ ఇస్తున్నారు.

అంతా అయోమయం..

రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతుండగా సర్వేల హడావుడి జనాలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లు టికెట్ ఆశించే నేతలే సొంత సర్వేలు చేయించుకునేవారు. ఇప్పుడు బీజేపీ ఢిల్లీ పెద్దలు పార్టీకి నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలపైనే ఫోకస్ చేయడం గమనార్హం. అసలు విషయానికి వస్తే.. టికెట్ తమకే అని చెప్పుకుంటున్న కొందరు నేతలకు ఏమాత్రం జనాదరణ లేదని, అంతా ఆర్భాటమే తప్ప.. పార్టీ, కేంద్ర పథకాల వారికే తెలియదని సర్వేలో జనాలు కుండ బద్దలు కొట్టారని సమాచారం. కాషాయ లీడర్లు పరిధి దాటి మంత్రులు, ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడుతున్నారు.

కానీ లోకల్ సమస్యలపై ఫోకస్ చేయడం లేదని, రోడ్డు మీద పడ్డ కాగితాలు, చిన్నపాటి గుంతలు చూపించడం, చెత్త వేసే స్థలంలోకి వెళ్లి ఇలాగే ఉంటుందా..? అని అడగడం మినహా ఒక్క సమస్యపై ప్రశ్నించే అవగాహన లేకపోవడం ఇదేమి రాజకీయమని సర్వే చేస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారట..! ఇలాంటి నేతలను నమ్ముకుంటే బీజేపీ గెలుస్తుందా..? అన్న రివర్స్ ప్రశ్నలకు సర్వే ప్రతినిధులు తెల్లమొహం వేస్తున్నారట. సర్వే నేతల మధ్య లోపాలను ఎత్తి చూపేందుకు, సమర్థతపై అనుమానాలు సృష్టించేందుకు జనాలకు ఓ వేదికగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Next Story