- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నార్ముల్ డెయిరీ’లో జీతాలిస్తలేరని మనోవేధనతో ఉద్యోగి మృతి
హయత్ నగర్ లోని నార్మూల్ డెయిరీలో విధుల్లో ఉండగా.. ఓ ఉద్యోగి కుప్పకూలి శుక్రవారం కింద పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

దిశ, వనస్థలిపురం : హయత్నగర్లోని నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్-మదర్ డెయిరీ) లో శుక్రవారం విధుల్లోనే కుప్పకూలి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం .. పసుమాముల గ్రామానికి చెందిన తులసిగారి బాల నర్సింహ్మ (46) నార్ముల్ మదర్ డెయిరీలో గత కొన్నేండ్లుగా ప్లాంట్ ఆపరేటర్ విభాగంలో.. ప్రీ ప్యాక్ సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఆఫీసుకు వచ్చారు. డ్యూటీ చేస్తుండగా.. సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే స్థానికంగా ఉండే వనస్థలిపురంలోని ఈవ్య హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మలక్పేటలోనే యశోద ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్తో పరిస్థితి సీరియస్గా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచనతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు.
జీతాలందక ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమయ్యాడు: కుటుంబ సభ్యులు
గాంధీ ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో మృత దేహాన్ని తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు డెయిరీ ఎదుట ఆందోళనకు దిగారు. బాల నర్సింహ్మ మృతికి నార్ముల్ డెయిరీ యాజమాన్యమే కారణమని ఆరోపించారు. ఆయన కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. డెయిరీ లోపలికి వెళ్లడానికి గేట్లు తోసుకుని వెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారమవ్వడంతో బాల నర్సింహ్మ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన బ్రెయిన్స్ట్రోక్ కు గురయ్యారని, నార్ముల్ డెయిరీ యాజమాన్యం నిండుప్రాణాలు బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాల నర్సింహ్మ కుటుంబానికి అండగా ఉంటాం: చైర్మన్ మధుసూదన్రెడ్డి
ప్రీ ప్యాక్ సెక్షన్ సూపర్వైజర్ బాలనర్సింహ్మ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగి కుటుంబానికి అంత్యక్రియలకు తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందజేశామని చెప్పారు. కుటుంబ సభ్యులు పెట్టిన డిమాండ్లను త్వరలో జరగబోయే బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంప్లాయీస్కు రెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, అవి త్వరలో చెల్లిస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.






