ఒక మైలు న‌డ‌వండి.. ర‌క్తంలో గ‌డ్డ‌ల‌ను అడ్డుకోండి

by Disha Web Desk 7 |
ఒక మైలు న‌డ‌వండి.. ర‌క్తంలో గ‌డ్డ‌ల‌ను అడ్డుకోండి
X

దిశ, ఖైరతాబాద్: ధ‌మ‌నులు, సిర‌ల్లాంటి ర‌క్తనాళాల్లో ర‌క్తం గ‌డ్డక‌ట్టడం వ‌ల్ల చాలాసార్లు ప్రాణాపాయం సంభ‌విస్తుంది. ప్రతిరోజూ కొద్దిపాటి న‌డ‌క లాంటి వ్యాయామంతో ఈ గ‌డ్డలు సంభ‌వించ‌కుండా చూసుకోవచ్చు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు హైద‌రాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో జ‌లవాయు విహార్ వ‌ద్ద ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో డీప్ వీన‌స్ థ్రాంబోసిస్ (డీవీటీ)పై అవ‌గాహ‌న న‌డ‌క నిర్వహించారు. ప్రముఖ సినీన‌టి మంచు ల‌క్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర‌రావు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్ వాస్క్యుల‌ర్, ఎండోవాస్క్యుల‌ర్ స‌ర్జన్ డాక్టర్ న‌రేంద్రనాథ్ మేడా మాట్లాడుతూ.. ‘‘ఎక్యూట్ వీన‌స్ థ్రాంబో ఎంబోలిజం (వీటీఈ), డీప్ వీన‌స్ థ్రాంబోసిస్ (డీవీటీ), ప‌ల్మన‌రీ ఎంబోలిజం (పీఈ).. ఈ మూడింటి వ‌ల్ల దీర్ఘకాల స‌మ‌స్యల‌తో పాటు మ‌ర‌ణం కూడా సంభ‌వించే ప్రమాదం ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా నిశ్చల జీవ‌న‌శైలి, దుర‌ల‌వాట్ల కార‌ణంగా సాధార‌ణ ప్రజానీకంలోనూ డీవీటీ స‌మ‌స్య క‌న‌ప‌డుతోంది. అంత‌ర్జాతీయంగా మార్చి నెల‌ను డీవీటీ అవ‌గాహ‌న మాసంగా ప‌రిగ‌ణిస్తారు. శ‌రీరంలో ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ న‌రాల్లో ర‌క్తం గ‌డ్డక‌ట్టడ‌మే డీవీటీ. ఇది ఎక్కువ‌గా కాళ్లలో క‌న‌ప‌డుతుంది.

దీనివ‌ల్ల సాధార‌ణ ర‌క్తప్రసారానికి ఆటంకం క‌లుగుతుంది. ఈ గ‌డ్డలు ర‌క్తంతోపాటు శ‌రీరంలోకి ప్రవ‌హించి.. గుండె, ఊపిరితిత్తుల్లోకీ చేరుతాయి. ఇది ప్రాణాంత‌కం అవుతుంది. కాళ్లలో వాపు, నొప్పి, రంగుమార‌డం, చ‌ర్మం బాగా వేడెక్కడం లాంటివి క‌నిపిస్తాయి. చాలావ‌ర‌కు డీవీటీ కేసుల్లో ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల చికిత్స ఆల‌స్యమై మ‌ర‌ణాలు సంభ‌విస్తాయి. డి-డైమ‌ర్ అనే ర‌క్తప‌రీక్షతో పాటు న‌రాల‌కు అల్ట్రాసౌండ్, వీనోగ్రఫీతో డీవీటీని అంచ‌నా వేయొచ్చు. ఇంత‌కుముందు డీవీటీ వ‌చ్చిన‌వారు, స్ట్రోక్ బాధితులు, గ‌ర్భిణులు, ఊబ‌కాయులు, పెద్ద శ‌స్త్రచికిత్సలు చేయించుకున్నవారు, 65 ఏళ్లు దాటిన‌వారు, ఎక్కువ‌సేపు ప్రయాణం చేసిన‌వారు, పూర్తి విశ్రాంతిలో ఉన్నవారికి ఇత‌రుల కంటే డీవీటీ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ’’ అని తెలిపారు.

ముఖ్య అతిథి, ప్రముఖ సినీన‌టి మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ.. ‘‘మ‌హిళ‌ల్లో డీవీటీ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. ముఖ్యంగా ఈస్ట్రోజ‌న్ హార్మోన‌ల్ థెర‌పీ తీసుకున్నవారు, గ‌ర్భనియంత్రణ కోసం మాత్రలు వేసుకునేవారికి ఇది వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ర‌జ‌స్వల అయిన‌ప్పటి నుంచి మెనోపాజ్ వ‌చ్చే వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు వీన‌స్ థ్రాంబో ఎంబోలిజం వ‌చ్చే ముప్పు చాలా ఎక్కువ‌. ఆ త‌ర్వాత కూడా పురుషుల కంటే మ‌హిళ‌ల‌కు వీటీఈ, డీవీటీ వ‌చ్చే ప్రమాదం ఎక్కువ‌. గ‌ర్భిణుల‌కు, గ‌ర్భనిరోధ‌క మాత్రలు తీసుకునేవారికీ ఈప్రమాదం ఎక్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల మ‌హిళ‌లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు ఒక మైలు దూరం న‌డిస్తే చాలు.. ఇది వ‌చ్చే ముప్పు చాలావ‌ర‌కు త‌గ్గుతుంది. ఇంట్లో ప‌ని కోసం అటూ ఇటూ తిర‌గ‌డ‌మే కాదు, వాకింగ్ చేయ‌డానికి ఒక్క పావుగంట కేటాయిస్తే ఈ ప్రాణాంత‌క స‌మ‌స్య నుంచి మ‌న‌మంతా బ‌య‌ట‌ప‌డ‌గ‌లం. ఇంకెందుకు ఆల‌స్యం.. ప‌దండి, క‌లిసి న‌డుద్దాం’’ అని చెప్పారు.

గౌర‌వ అతిథిగా పాల్గొన్న కిమ్స్ ఆస్పత్రుల గ్రూప్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర‌రావు మాట్లాడుతూ.. ‘‘ఒక కాలిలో వాపు క‌న‌ప‌డ‌టం, నొప్పితో పాటు చ‌ర్మం కాస్త వేడెక్కడం, ఎర్రగా మార‌డం, న‌రాల‌ను చేత్తో ముట్టుకుని చూస్తే అవి గ‌ట్టిగా అయిన‌ట్లు అనిపించ‌డం.. ఇవ‌న్నీ డీవీటీ ల‌క్షణాలు. కేవలం కాళ్లలోనే కాదు, చేతులు, పొట్ట ప్రాంతంలోనూ డీవీటీ సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. ఇది వ‌చ్చిన‌ప్పుడు ఊపిరి స‌రిగా అంద‌క‌పోవ‌డం, గుండెనొప్పి అనిపించ‌డం కూడా ఉండొచ్చు. 60 ఏళ్లు దాటిన‌వారు, అధిక బ‌రువు ఉన్నవారు, పొగ‌తాగేవారు, కేన్సర్ లేదా గుండెపోటు లాంటివి వ‌చ్చిన‌వారు, వెరికోస్ వెయిన్స్ ఉన్నవారికి డీవీటీ వ‌చ్చే అవకాశాలు ఎక్కువ‌. మూడు గంట‌ల‌కు పైగా కారు, రైలు, విమానాల్లో ప్రయాణం చేసిన‌వారికీ ఈ స‌మ‌స్య రావ‌చ్చు. అస‌లు ఇలాంటి కార‌ణాలు ఏమీ లేక‌పోయినా ఇది రావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ప్రతిరోజూ త‌ప్పనిస‌రిగా న‌డ‌వ‌డం, కూర్చున్నప్పుడు ప్రభావిత‌మైన కాలిని పైకి లేపి పెట్టుకోవ‌డం, దీనికి మందులు తీసుకుంటున్నప్పుడు విమాన ప్రయాణాల‌ను రెండు మూడు వారాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది’’ అని సూచించారు.

Next Story

Most Viewed