హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12 గంటల వరకు పోలింగ్ శాతం ఇదే!

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12 గంటల వరకు పోలింగ్ శాతం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో అధికారులు మొత్తం రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం 10 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగింది. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉన్న అసుదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలు ముగిసే‌సరికి 77.68 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, 31 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు, 81 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా.. బీఆర్ఎస్ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది.

పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయం చుట్టూ 144 సెక్షన్‌ (144 Section) అమలు చేశారు. ఇవాళ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించారు. అందుకు గాను జూన్‌ 14 రెండో శనివారం (Second Saturday) వర్కింగ్ డేగా ఉంటందని పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌లో మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు కానుంది. పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ పొందిన వారు ఈ ఎన్నికలో విజయం సాధించనున్నారు. ఈ నెల 25న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు (Gautam Rao), ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్ (Mirza Riaz ul Hassan) బరిలో నిలిచారు.

Next Story