డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం: ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్

by Naga Rani Yarlagadda |

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజులలో భాగంగా గంజాయి, డ్రగ్స్‌‌పై ఉక్కుపాదం మోపుతోంది.

డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం: ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై స్పెషల్ డ్రైవ్స్‌తో చెక్ పెడుతున్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజులలో భాగంగా గంజాయి, డ్రగ్స్‌‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను నియమించారు.

హాట్ స్పాట్‌ల గుర్తింపు

ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోని నాలుగు ఎస్టీఎఫ్ టీమ్‌లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, జిల్లా స్థాయిలో డీటీఎఫ్ టీమ్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్, గంజాయి, ఎన్‌డీపీఎల్ అమ్మకాలపై నిఘా పెట్టడానికి కొన్ని హాట్ స్పాట్స్‌ను ఎంపిక చేశారు. ధూళిపేట్, నారాయణగూడ, ఫతేనగర్, సీతాఫల్‌మండి, నేరేడ్‌మేట్, షేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్, దిల్‌సుక్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, నాగోల్, అన్నోజిగూడ, ముగూరు బస్తీలను గుర్తించారు. వీటితో పాటు రైళ్ల తనిఖీలు, చెక్ పోస్టు వద్ద నిఘా పెంచడం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి

ఢిల్లీ, నోయిడా, గోవా, హర్యానా, ప్రాంతాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువగా వస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ గుర్తించింది. ఎయిర్‌పోర్టు, రైళ్లలోను, చెక్ పోస్టుల నుంచి వస్తున్న ఎన్‌డీపీఎల్ మద్యాన్ని అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,251 కేసుల్లో 16,103 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్‌లో 2025లో ఎయిర్‌పోర్టు ద్వారా వచ్చిన మద్యాన్ని శంషాబాద్, సరూర్‌నగర్, మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ మూడు స్టేషన్లలో 337 కేసుల్లో 3,631 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక నిఘా

గంజాయి, డ్రగ్స్‌పై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 2025లో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ నిర్వహించిన దాడుల్లో 565 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025లో ఎస్టీఎఫ్ టీమ్‌లు 1,346 కేజీల గంజాయిని పట్టుకున్నాయి. ఖమ్మం జిల్లాలో జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో రికార్డు స్థాయిలో 23 కేసుల్లో 185 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వీటితోపాటు 686 గంజాయి మొక్కలను, ఓజీ ఖుష్, ఎండీఎంఏ, హషీష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

దాడులను మరింతగా పెంచాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజులు కార్యక్రమంలో భాగంగా దాడులును మరింత ముమ్మరం చేస్తాం. ఎన్‌డీపీఎల్ మద్యాన్ని కట్టుదిట్టం చేస్తున్నాం. డ్రగ్స్, గంజాయిని రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. హాట్ స్పాట్లను గుర్తించే విధంగా సూచనలు చేశాం.

- షానవాజ్ ఖాసీం,

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, హైదరాబాద్

Next Story