తుమ్మల, పొంగులేటి.. ఖమ్మం బరిలో ఎవరు? సోషల్ మీడియాలో జోరుగా చర్చ!

by Disha Web Desk 4 |
తుమ్మల, పొంగులేటి.. ఖమ్మం బరిలో ఎవరు? సోషల్ మీడియాలో జోరుగా చర్చ!
X

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయనున్నారన్న విషయం జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది. ఓ వైపు పొంగులేటి.. మరోవైపు తుమ్మల.. ఇంకోవైపు మువ్వా విజయ్ బాబు పేర్లు వినిపిస్తుండగా.. ఈ ముగ్గురిలో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణల ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‌- దిశ, ఖమ్మం బ్యూరో:

దిశ, ఖమ్మం బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. హేమాహేమీలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో ఈ చర్చ మరింతగా జరుగుతోంది. వీరితో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కూడా ఇప్పటికే గడపగడపకూ కాంగ్రెస్ పేరిట ప్రచారం మొదలుపెట్టడం ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఉంటుంది? ఎవరి ప్రత్యర్థిని ఢీకొట్టగల సత్తా ఉన్నవాళ్లు? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో జరుగుతోంది.

ముగ్గురూ... ముగ్గురే..

పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరాక.. ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఊపొచ్చిందన్న విషయం తెలిసిందే. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రధాన చర్చ మాత్రం ఖమ్మం మీదే జరుగుతుండటం విశేషం. తాజాగా కొద్దిరోజుల క్రితం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆపార్టీ శ్రేణులు మరింత దూకుడు పెంచాయి.

వీరితో పాటు పొంగులేటి ప్రధాన అనుచరుడైన మువ్వా విజయ్ బాబు కూడా పోటీలో ఒకరిగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం బరిలో పొంగులేటి , తుమ్మల నాగేశ్వరరావు పేర్లతో పాటు మువ్వా విజయ్ బాబు పేరు కూడా వినిపించడంతో ముగ్గురి పేర్లు తెరమీదకు వచ్చాయి. వీరిలో తుమ్మల లేదా పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నా తుమ్మల నాగేశ్వరరావే ఖమ్మం బరిలో ఉండే చాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.

సామాజిక సమీకరణల నేపథ్యంలో..

ఖమ్మం బరిలో గెలిచేందుకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కీలకం కావడంతో తుమ్మల నాగేశ్వరరావును బరిలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వాస్తవానికి తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని భావించినా మారిన ఈక్వేషన్స్ కారణంగా ఖమ్మంలో పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తుమ్మలకు గట్టి పట్టు ఉండటం.. ఖమ్మంలో పోటీ చేస్తే తన సామాజికవర్గం ఓట్లు కలిసివచ్చే అంశంగా భావిస్తుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే తుమ్మల నాగేశ్వరరావే సరైన వ్యక్తిగా ప్రచారం సాగుతుంది. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చ సాగుతోంది.

పాలేరు లేదా కొత్తగూడెం బరిలో పొంగులేటి..

పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేసే అవకాశం ఉంటుందంటున్నారు ఆయన అనుచరులు. ఆ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ఓట్లతో పాటు.. కాంగ్రెస్‌‌కు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండటం పొంగులేటికి కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. ఖమ్మం మినహా పాలేరు, కొత్తగూడెం జనరల్ సీట్లు కావడంతో కొత్తగూడెం అభ్యర్థి ఎవరనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ పేరు కూడా తెరమీదకు వస్తుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్రావ్, పాలేరు అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తారనే భావన వ్యక్తం అవుతుంది. జలగం ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటే పొంగులేటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదోఒకదాని నుంచి పోటీ చేస్తారని అనుచరులు భావిస్తున్నారు.

టఫ్‌గా మారనున్న జనరల్ స్థానాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ స్థానాలైన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న సమీకరణల నేపథ్యంలో గట్టి పోటీ తప్పదనే టాక్. తుమ్మల, పొంగులేటి ఖమ్మం, పాలేరులో పోటీచేసినా మిగిలిన మరో నియోజకవర్గంలో కూడా ధీటైన అభ్యర్థినే ఎంపికచేస్తారనే ప్రచారం సాగుతోంది.

Next Story

Most Viewed