నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద హై టెన్షన్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద హై టెన్షన్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కృష్ణ నది జల పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. డ్యామ్‌పై తమకు సమాన హక్కులు ఉన్నాయంటూ బుధవారం రాత్రి ఏపీ పోలీసులు బలవంతంగా డ్యామ్‌ మీదకు చొచ్చుకెళ్లిన విషయం తెలిసిందే. డ్యామ్ 13వ గేటు దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు చేయడంతో పాటు.. రైట్ కెనాల్ ద్వారా ఏపీకి నీటిని విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

కృష్ణ నీటి పంపకాల విషయం ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి ఉద్రిక్తంగా మారడంతో కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగర్ నీటి వివాదంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సాగర్ నీటి పంపకం విషయంలో మరోసారి వివాదం తలెత్తడంతో కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక పంపనుంది. మరోవైపు నాగర్జున సాగర్ డ్యామ్ వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను డ్యామ్ వద్దకు వెళ్లాలని ఆదేశించారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు నాగార్జన సాగర్ డ్యామ్ వద్దకు వెళ్లనున్నారు.

Next Story

Most Viewed