Medaram Jatara 2026 : మేడారం రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

by Ramesh Naini |

వనదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

Medaram Jatara 2026 : మేడారం రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వనదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం (Medaram Jatara 2026) అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో మేడారం జాతరకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా తాడ్వాయి-మేడారం రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భక్తుల అవస్థలు తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాహనాలను కదిలించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

జనసంద్రంగా మేడారం..

వన దేవతలు గద్దెలపైకి చేరడంతో మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మొక్కులు చెల్లించుకునేందుకు శుక్రవారం నాడు భక్తులు పోటెత్తడంతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎటు చూసినా భక్తుల తలలే కనిపిస్తుండటంతో అధికారులకు రద్దీ నియంత్రణ సవాలుగా మారింది. భద్రత కట్టుదిట్టం మరోవైపు జాతరకు వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 25 మంది ఐపీఎస్ అధికారులు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఈ నెల 28న వైభవంగా ప్రారంభమైన ఈ జాతర, 31వ తేదీన వనప్రవేశంతో ముగియనుంది.

Next Story