AIIA: రాష్ట్రంలో జాతీయ ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ ! కేంద్రానికి ఆరోగ్య మంత్రి లేఖ

by Ramesh Naini |

తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ (AIIA)ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు.

AIIA: రాష్ట్రంలో జాతీయ ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ ! కేంద్రానికి ఆరోగ్య మంత్రి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (All India Institute of Ayurveda) తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ (AIIA)ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) విజ్ఞప్తి చేశారు. 2030 నాటికి దేశంలో 10 ఆల్‌ ఇండియా ఆయుర్వేద ఇనిస్టిట్యూట్స్‌ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆయుష్, ఆరోగ్యశాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌‌కి మంత్రి దామోదర్ రాజనర్సింహ లేఖ రాశారు. తెలంగాణ అడవుల్లో అద్భుతమైన ఆయుర్వేద సంపద ఉందని, మెడిసినల్ వాల్యూస్ ఉన్న మూలికలు, మొక్కల జాతులు ఉన్నాయని మంత్రి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే సుమారు 800 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించామని వెల్లడించారు.

ఆయుష్ హాస్పిటళ్లను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో వందల ఏళ్లుగా ఆయుష్ వైద్య విధానాలకు మంచి ప్రాచుర్యం ఉందని, ఇక్కడి ప్రజలు ఆయుష్‌ వైద్య సేవలను కూడా వినియోగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేయబోయే ఆయుర్వేద ఇనిస్టిట్యూట్స్‌లో ఒకటి తెలంగాణకు కేటాయించాలని, అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. ఈ మేరకు శనివారం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌‌ని కలిసి లేఖను అందజేశారు.

Next Story