Harish Rao Thanneeru : ఈ సారి హ్యాట్రిక్ పక్కా : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 22 |
Harish Rao Thanneeru : ఈ సారి హ్యాట్రిక్ పక్కా : మంత్రి హరీష్ రావు
X

దిశ, మెదక్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా కొడతారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, కార్యాలయం వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం‌లో మాట్లాడుతూ.. ఈ నెల 23న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెదక్ సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ భవనాల ప్రారంభం‌తో పాటు మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ చర్చి గ్రౌండ్‌‌‌లో సభ ఉంటుందని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు రైల్వే లైన్, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లా అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష.. కానీ గతంలో ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ ప్రధానితో కూడా మెదక్ జిల్లా కల సాకారం కాలేదన్నారు. రైల్వే సౌకర్యం కూడా కల్పించలేదన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక మెదక్ ప్రజల చిరకాల కల నెరవేరిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజల కల కలగానే మిగిలిపోయేదని ఎద్దేవా చేశారు. మన సంక్షేమ పథకాలు చెబితే ఇతరులు ఆశ్చర్య పోయారని, కానీ ఇప్పుడు వాటిని పొగుడుతున్నారనీ అన్నారు. గత తొమ్మిదేళ్లుగా మెదక్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నామని జిల్లా, యువత ఉద్యోగులు, మహిళలు భారీ సంఖ్యలో రావాలని కోరారు. రాష్ట్రం లో కాంగ్రెస్, బీజేపీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లు లేరని, ఇక బీజేపీకీ క్యాడర్ ఎక్కడ లేదన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అక్కడ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఎవరు నమ్మలేదని, కానీ ఇచ్చి నిరూపించామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కేసీఆర్‌ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం రైతులతో ధాన్యం రికార్డు స్థాయిలో పండించేందుకు బిజీగా ఉన్నారని వివరించారు.

రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల్లో పోడు పట్టాలు ఇచ్చామని.. అందులో 1.5 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులర్, వీఆర్ఏ‌లకు పదోన్నతి, ఆర్టీసీ విలీనం, రుణమాఫీ కూడా చేశామని తెలిపారు. మెదక్ లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు తో పాటు పనుల ప్రారంభం కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న పనులను ప్రశంసించారు. ఈ సమావేశంలో ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, వెంకటయ్యతో పాటు తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed