ఈటల, బండి సంజయ్‌ ఓటమిపై హరీష్ రావు సీరియస్ కామెంట్స్

by Disha Web Desk 2 |
ఈటల, బండి సంజయ్‌ ఓటమిపై హరీష్ రావు సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీగా గెలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులకు పాల్పడుతారా? అని మండిపడ్డారు. దమ్ముంటే ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు.

తరచూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని మాట్లాడుతున్నారని.. తాము ఒకటే అయితే కరీంనగర్‌లో బండి సంజయ్‌ను, కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌ను, బోథ్‌లో సోయం బాపు రావు, హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను, దుబ్బాక రఘునందన్ రావును ఎందుకు ఓడిస్తామని గుర్తుచేశారు. ప్రజలకు అన్నీ తెలుసని ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణలో బీజేపీని పాగా వేయకుండా అడ్డుకున్నది బీఆర్‌ఎస్సే అని మరోసారి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తెలంగాణ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పోలీసులను వాడుకొని తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Next Story