పాదయాత్రపై హరీశ్ రావు సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత పరిణామానికి తెరలేచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రాజెక్టుల నిలిపివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు.

పాదయాత్రపై హరీశ్ రావు సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత పరిణామానికి తెరలేచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రాజెక్టుల నిలిపివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా 'బసవేశ్వర నుండి సంగమేశ్వర' వరకు భారీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్లి ఎండగట్టడమే తన అజెండా అని ఆయన ప్రకటించారు.

రేవంత్ రెడ్డికి ఆ దేవుళ్లే గుణపాఠం చెబుతారు..

ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరుపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. "ప్రాజెక్టులను ఆపి ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆ బసవేశ్వరుడు, సంగమేశ్వరుడే తగిన గుణపాఠం చెబుతారు" అని హరీశ్ రావు హెచ్చరించారు.

ప్రజా క్షేత్రంలోనే కాంగ్రెస్ తప్పుల లెక్కింపు..

అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, పైగా నడుస్తున్న ప్రాజెక్టులను కూడా పడకేసేలా చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ చారిత్రక తప్పులను, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకే తాను జనం మధ్యకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాదయాత్ర ద్వారా నిలిచిపోయిన ప్రాజెక్టుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా హరీశ్ రావు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హరీశ్ రావు పాదయాత్ర ప్రకటనతో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.

Next Story