హరీష్ రావు కాళేశ్వరంపై త‌ప్పుడు ప్రచారం మానుకోవాలి : ఆది శ్రీనివాస్

by Malleboina Mahesh |

కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోస్తే జ‌రిగే ప‌రిణామాల‌ను సీఎం చాలా స్పష్టంగా వివ‌రించారని ఆది శ్రీనివాస్ అన్నారు.

హరీష్ రావు కాళేశ్వరంపై త‌ప్పుడు ప్రచారం మానుకోవాలి : ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం పైన హ‌రీష్ రావు అబ‌ద్దాల వ‌ర‌ద‌ను పారిస్తున్నారని, చ‌దువుకున్నది పాలిటెక్నిక్ అయినా పెద్ద ఇంజ‌నీర్ లా ఆయన మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటిని ఎత్తిపోస్తే జ‌రిగే ప‌రిణామాల‌ను సీఎం చాలా స్పష్టంగా వివ‌రించారని, బ్యారేజ్ లకు మ‌ర‌మ్మత్తులు జ‌రిగాకే నీటిని ఎత్తిపోస్తామని, ఇక నైనా కాళేశ్వరంపైన త‌ప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు. త‌న మెద‌డు అంతా రంగ‌రించి నిర్మించాన‌ని మామ చెపితే హ‌రీష్ రావు ఆయ‌న‌కు తోడ‌య్యాడని, కాళేశ్వరం కూలేశ్వరం అయినా సిగ్గుప‌డ‌కుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

కాళేశ్వరం కూలిపోయింద‌ని కుమిలిపోయి రాష్ట్ర రైతుల‌కు క్షమాప‌ణ చెపుతార‌ని భావించామని, బీఆర్ఎస్ నాయ‌కులు అస‌హ‌నంలో ఉన్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సీఎం కాళేశ్వరం పైన స్పష్టమైన స‌మాచారం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయ‌కులు అబ‌ద్దాలు చెప్తున్నారని, జులై 28, 2004న ఆ నాటి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎల్లంప‌ల్లికి శంకుస్థాప‌న చేశారు, 2004 , 2009 మ‌ధ్యనే బ్యారేజీ, మెయిన్ కెనాల్స్ పూర్తి అయ్యాయని, ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మాణానికి రాళ్లు తానే మోసిన‌ట్లుగా హ‌రీష్ రావు మాట్లాడుతున్నాడని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఎల్లంపల్లిని కూడా త‌మ ఖాతాలో వేసుకోవ‌డానికి ప్రయ‌త్నం చేస్తున్నారని, ఎల్లంప‌ల్లి తెలంగాణ‌కు గుండె కాయ అని, మేడిగ‌డ్డ తెలంగాణ గుండె కాయ అన్నారు కానీ, అది జారిపోయిందన్నారు.

సైకోలుగా మారింది బీఆర్ఎస్ నాయ‌కులని, క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయాలంటే మేడిగ‌డ్డ, అన్నారం, సుందీళ్ల‌లో నీళ్లు ఉండాలని ఆది శ్రీనివాస్ చెప్పారు. నీళ్లను నిల్వ చేస్తే బ్యారేజీల‌కు ప్రమాదం అని బీఆర్ఎస్ హ‌యాంలోనే ఎన్డీఎస్ఏ సూచించిందని, క‌న్నెప‌ల్లిలో మీట నొక్కితే ఎల్లంప‌ల్లిలో నీళ్లు ఎలా వ‌చ్చి ప‌డ‌తాయి..? ఊర్లు కొట్టుకుపోయినా స‌రే రాజ‌కీయాలు ముఖ్యం అన్నట్లు బీఆర్ఎస్ నేత‌ల తీరు ఉందని ఆయన ఫైర్ అయ్యారు. రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు హ‌రీష్ రావుకు మంత్రి ప‌ద‌వే ఇవ్వకుండా కేసీఆర్ ప‌క్క‌న పెట్టాడని, సైకోలా మారి రైతుల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టించే ప్రయ‌త్నం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story