Gutta Sukhender Reddy: ఆందోళనకరంగా ప్రజాప్రతినిధుల భాష

by Gantepaka Srikanth |

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల భాషా ఆందోళనకరంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Gutta Sukhender Reddy: ఆందోళనకరంగా ప్రజాప్రతినిధుల భాష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల భాషా ఆందోళనకరంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, ఇండియా రీజియన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. శాసనసభలు నిజమైన చర్చా దేవాలయాలుగా మారినప్పుడు ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని, శాసనసభ్యులుగా ఒకరినొకరని గౌరవించుకోవాలన్నారు. విభిన్న అభిప్రాయాలను గౌరవిస్తే, ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే, ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా వారి ఆకాంక్షలను కూడా నెరవేర్చగలమని తెలిపారు. ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువు శాసన సభ, శాసన మండలి సభలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు తమ కోసం మాట్లాడతారని, తమ ప్రయోజనాలను కాపాడుతారని, రాజ్యాంగ విలువలను నిలబెడుతారని నమ్ముతారని అన్నారు.

అయితే.. ఇటీవలి కాలంలో అంతరాయాలు, అర్థవంతమైన చర్చ లేకపోవడం, శాసనసభ కార్యకలాపాలలో గౌరవం లేకపోవడంతో పౌరులలో కాస్త ఆందోళన పెరుగుతున్నదని చెప్పారు. సభలో చర్చలు ఉత్సాహంగా ఉండాలని.. ఎప్పుడూ అగౌరవంగా ఉండకూడదని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉన్న రెండు శాసనసభలు ప్రజల అభ్యున్నతి కోసం, సరియైన చట్టాలను రూపొందించడం కోసం పనిచేస్తున్నాయని, శాసన మండలి చైర్మన్‌గా సభలో సభ్యులందరి హక్కులను కాపాడుతున్నానని గౌరవంగా తెలుపుతున్నానని ఆయన తెలిపారు. ఇటీవల సంక్షేమ పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యా సంస్కరణలపై, బీసీ వర్గాల రిజర్వేషన్లపై అర్థవంతమైన చర్చలు శాసన సభలలో జరిగాయని ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రెటరీ డా.వి.నరసింహాచార్యులు, చైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్‌‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story