జేఎల్‌లో గెస్ట్ లెక్చరర్లకు వెయిటేజీ ఇవ్వాలి..గెస్ట్ లెక్చరర్ల సంఘం డిమాండ్

by Dishafeatures2 |
జేఎల్‌లో గెస్ట్ లెక్చరర్లకు వెయిటేజీ ఇవ్వాలి..గెస్ట్ లెక్చరర్ల సంఘం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ జేఎల్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా గెస్ట్ లెక్చరర్ల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వెయిటేజీ కల్పించాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కళాశాలల్లో పూర్తి సమయం ఉంటూ.. రెగ్యూలర్ లెక్చరర్ల తో సమానంగా పని చేస్తున్నట్లు తెలిపింది. జేఎల్ రిక్రూట్‌మెంట్ పూర్తి అయ్యేవరకు గెస్ట్ లెక్చరర్లకు కన్సాలిడేట్ వేతనాలు ఇవ్వాలని పేర్కొంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు పూర్తి వేతనం అమలయ్యేలా చూడాలని విద్యాశాఖ మంత్రికి ఆదేశించడం పట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కే మహేష్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.బాబురావు, కోశాధికారి బండి కృష్ణ, రాష్ట్ర కమిటీ నాయకులు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

ఈ విద్యాసంవత్సరం నుండే కన్సాలిడేట్‌గా, 12 నెలల వేతనం అమలయ్యేలా చూడాలని వారు కోరారు. పీరియడ్ విధానం వల్ల పూర్తి వేతనం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ విద్యా సంవత్సరం నుండే వర్తించేలా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ కమీషనర్ నవీన్ మిట్టల్‌లు చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed