రిటైర్డ్ ఆఫీసర్లకు గుడ్ న్యూస్

by Yella Dhawani Reddy |

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్​ఉద్యోగులు, అధికారులను తొలగించాలని రేవంత్ సర్కార్ భావించింది.

రిటైర్డ్ ఆఫీసర్లకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్​ఉద్యోగులు, అధికారులను తొలగించాలని రేవంత్ సర్కార్ భావించింది. దారిపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో అనేక మంది సర్వీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం హర్షించాయి. ఇప్పుడున్న వారు వెళ్లిపోతే తమకు ప్రమోషన్లు లభిస్తాయని ఆశపడ్డారు. కానీ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నీటిపారుదల శాఖలో పదవీకాలం పూర్తయిన​వారిని ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకోగా.. మిగిలిన ఇంజినీరింగ్, ఇతరశాఖల్లో అమలు కాకపోవడంతో అధికారులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

కొత్త వారికి అవకాశాలు దూరం

రిటైర్మెంట్​ అయిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్తగా ఎంపిక అయిన రెగ్యులర్ ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఒకవేళ ఏదైనా శాఖలో రిటైర్ అయిన వారి సేవలు అత్యవసరం అనుకుంటే ఎందుకు అవసరమో చెబుతూ ఫైల్​పంపించాలని ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను కోరింది. ఇలా పలుశాఖల నుంచి సిఫారసు లేఖలు రావడంతో రిటైర్డ్ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు తిరిగి వారినే రీ అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బుధవారం మెట్రో రైలు ఎండీ ఎన్వీస్​రెడ్డి పునర్ నియామకం జరగగా.. గురువారం మరికొందరి రిటైర్డ్​అధికారుల పునర్ నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

పంచాయతీ రాజ్​శాఖలో ఇంజినీరింగ్ విభాగం ఈఎన్‌సీగా పనిచేస్తున్న కనకరత్నం గత మార్చి 31తో రిటైర్ట్ అయ్యారు. ఆయన స్థానంలో సర్వీసులో ఉన్న సీఈని నియమిస్తే మిగిలిన తెలంగాణ ఇంజినీర్లు సంతోషిస్తారని అనుకున్నా.. తిరిగి కనకరత్నంను మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పీఆర్ ఇంజినీరింగ్​విభాగం ఇంజినీర్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మిషన్​భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి 2017 అక్టోబరు 31న పదవీ విరమణ చేశారు. గత ఎమిదిదేండ్లుగా ఆయనే ఈఎన్‌సీగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన నియామకాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక స్త్రీ నిధి ఎండీగా విద్యాసాగర్ రెడ్డి 2011 సెప్టెంబర్​7 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఆయనకు మరో సంవత్సరం పాటు అదే పోస్టులో ఉండేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పుష్కరకాలంగా ఒక సంస్థకు ఒకే వ్యక్తిని అధిపతిగా ఎలా నియమిస్తారంటూ అక్కడి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన పునర్​నియామకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన శాఖల్లోనూ ఇదే రకమైన నియామకాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒక శాఖలో తీసుకున్న నిర్ణయాన్ని మిగిలిన శాఖల్లోనూ అమలు చేసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని, ఎంతో ఉహించుకున్న రెగ్యులర్ ఉద్యోగులు, నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుందని అంటున్నారు. రిటైర్డ్​ఉద్యోగులు వేల సంఖ్యలో ప్రభుత్వంలో వివిధ హోదాల్లో కాంట్రాక్టు, కన్సల్టెన్సీ, అవుట్​సోర్సింగ్​ పేరుతో కొనసాగుతున్నారు. వీరిని తొలగిస్తే వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు లభించేవి. కానీ, అందుకు ఆస్కారం లేకుండా పోయింది. అనుభవజ్ఞులైన అధికారులు ఉన్న దగ్గర సైతం ఇదే విధంగా పునర్ నియామకం చేయడంపై పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

Next Story