పత్తి రైతులకు తీపికబురు.. CCI కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-21 10:56:33  IST  )

కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

పత్తి రైతులకు తీపికబురు.. CCI కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇవాళ ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్టార్ట్ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ ఇప్పటికే నోటిఫై చేయగా కొనుగోళ్లు మరో నాలుగైదు రోజుల్లో ఊపందుకోనున్నాయి. అదేవిధంగా రేపు ఖమ్మం జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న నల్గొండ జిల్లాలో పలు సీసీఐ కేంద్రాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy), తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలంలో 45.32 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా 28.29 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

కాగా, ‘కిసాన్ కపాస్’ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే పత్తి విక్రయించేలా సీసీఐ, మార్కెటింగ్​ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగయ్యే ప్రధాన జిల్లాల్లో అన్నదాతలు జోరుగా పత్తిని తీస్తున్నారు. ఇక రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మార్కెటింగ్ శాఖ టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్ 1800-599-5779 ద్వారా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, సహకార శాఖలోని డైరెక్టర్, ఎండీ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించింది. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Next Story