‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం.. విజన్-2047‌కు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 01:50:22  IST  )

భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిధిలోని 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA)‌ను ఏర్పాటు చేసింది.

‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం.. విజన్-2047‌కు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక అయిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' అభివృద్ధిపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రంగారెడ్డి జిల్లాలోని 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల్, యాచారం మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ‘విజన్ అండ్ సమగ్ర మాస్టర్ ప్లాన్-2047’ కోసం ఎఫ్‌సీడీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు తమ ప్రతిపాదనలతో రావాలని నోటిఫికేషన్‌లో కోరింది.

56 గ్రామాలకు సమగ్ర మాస్టర్ ప్లాన్..

హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 రెవెన్యూ గ్రామాలకు మరో 20 గ్రామాలను కలిపి ఎఫ్‌సీడీఏను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్-2050లో 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కానీ 20 రెవెన్యూ గ్రామాలు మాత్రం మాస్టర్ ప్లాన్ పరిధిలో లేవు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానం చేస్తూ 56 గ్రామాల కోసం సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎఫ్‌సీడీఏలో ముఖ్యంగా ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై (Economic Development Plan) ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

1.75 లక్షల ఎకరాలు..

ఎఫ్‌సీడీఏ పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 1.75 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిలోనే 20 వేల ఎకరాల్లో ముచ్చర్ల ఫార్మాసిటీ భూములు ఉన్నాయి. అయితే ఫార్మాసిటీకి సంబంధించిన 20 వేల ఎకరాల్లో టీజీఐఐసీ (TGIIC) ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మొత్తంగా ఎఫ్‌సీడీఏ పరిధిలోని 1.75 లక్షల ఎకరాల భూములను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బిడ్ దాఖలుకు మార్చి 12 వరకు గడువు..

ఎఫ్‌సీడీఏ సమగ్ర మాస్టర్ ప్లాన్-2047 కోసం ఆసక్తి ఉన్నవారు తమ ప్రతిపాదనలను అందజేయడానికి గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశముంది. మార్చి 12 సాయంత్రం 5 గంటల వరకు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేయడానికి అవకాశముందని, మార్చి 16న బిడ్ ఓపెన్ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Next Story