Forum For Good Governance: కలుషిత జలాల్లో మందిరాల నిర్మాణం సరికాదు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-03 16:47:03  IST  )

ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుద్ధరణకు తీసుకున్న నిర్ణయం భేష్ అని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ అధ్యక్షుడు ఎం.ప‌ద్మనాభ‌రెడ్డి పేర్కొన్నారు.

Forum For Good Governance: కలుషిత జలాల్లో మందిరాల నిర్మాణం సరికాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుద్ధరణకు తీసుకున్న నిర్ణయం భేష్ అని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ అధ్యక్షుడు ఎం.ప‌ద్మనాభ‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, మూసీనదిని పూర్తిగా శుద్ధి చేయకముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు వంటి పూజా స్థలాల నిర్మాణాన్ని ప్రారంభించడం సముచితం కాదని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2001లో వాటర్ బోర్డ్ మూసీ పునరుద్ధరణకు ఒక ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రణాళికను ఆమోదించినప్పటికీ, దాని అమలుకు రూ. 405 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. అటు త‌ర్వాత మూసీన‌దిలో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు జీహెచ్ఎంసీ హైకోర్టు స‌మీపంలో రూ.50 కోట్ల వ్యయంతో రబ్బర్ డ్యామ్ నిర్మించింది. అది కూడా ప్రయోజనం కలిగించలేదు. గత 9 ఏళ్లలో మూసీనది శుద్ధీకరణలో పురోగతి సాధించలేదు.

పలుచోట్ల జరిగిన ఆక్రమణల కారణంగా నగరంలో ప్రవహించే మూసీనది పెద్ద నాలా లేదా డ్రైనేజీలా మారిపోయింది. తగిన మురుగు నీటి శుద్ధి వ్యవస్థలు లేకపోవడంతో శుద్ధి చేయని మురుగు నీరు నదిలోకి చేరుతూ తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తోంది. మూసీ అత్యంత కాలుష్యం కలిగిన నదిగా పొల్యూషన్ బోర్డు గుర్తించింది. ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలు శుద్ధిచేయని వ్యర్థాలను నదిలోకి విడుదల చేయడం వల్ల ప్రమాదకర రసాయనాలు మరియు ఔషధ అవశేషాలు నదిలో చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మూసీనదిని శుద్ధి చేయడం అత్యంత కీలకం. నదిని పూర్తిగా శుద్ధిచేయకముందే పూజాస్థలాల నిర్మాణం చేపట్టడం సముచితం కాదు. కాలుష్యంతో నిండిన నది మధ్యలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా తగినది కాదని భావిస్తున్నాం. ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకుని మూసీనది శుద్ధీకరణను ప్రథమ ప్రాధాన్యంగా చేపట్టాలని చేపట్టాలి’ అని ఎం.ప‌ద్మనాభ‌రెడ్డి కోరారు.

Next Story